Tuesday 21 March 2017

అడవిని పెంచి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి - జాదవ్ పాయెంగ్

మార్చి 21, ప్రపంచ అటవి దినోత్సవం సందర్భంగా మానవులు అడవులను నరుకుతున్న తరుణంలో, అడవిని పెంచి అందరికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి గురించి తెలుసుకుందాం.

-----------------------

ముందు నన్ను చంపి తరువాత నా చెట్ల మీద చెయ్యి వేయండీ....'అంటూ
అడవిలోని చెట్లను నరకటానికి వచ్చిన గ్రామస్తులకు అడ్డుగా నిలబడ్డాడు జాదవ్ పాయెంగ్.

ప్రాణం పోసిన వారికి కాకపోతె ప్రాణాన్ని పణం గా పెట్టేంతటి మమకారం ఇంకెవరికి వుంటుంది...!

ఇది అడవిని పెంచిన ఓ పర్యావరణ ప్రేమికుని కథ....

--------------------------

అడవిని సృష్టించాడు...

మనిషి తన స్వార్థం కోసం అడవుల్ని కొట్టేయడం వల్ల ఎన్నో జంతువులు అంతరించిపోయాయి. ఇంకెన్నో చివరి దశలో ఉన్నాయి. ఆ లెక్కన వాటి తర్వాత వరుసలో ఉన్నది మనుషులే. అతడు శాస్త్రవేత్త కాదు, ఇంత ఆలోచించడానికి. కానీ మనసున్న మనిషిగా సాటి జీవుల్నీ పర్యావరణాన్నీ ప్రేమించాడు. 1979లో అసోంలోని జొర్హాత్‌ జిల్లాలో వచ్చిన వరదల వల్ల పాములతో పాటు ఎన్నోరకాల సరీసృపాలు బ్రహ్మపుత్రా నదీ తీరానికి కొట్టుకొచ్చాయి. తర్వాత ఎండలు పెరగడంతో నది మధ్యలోని ఇసుక దీవులు వేడెక్కాయి. చుట్టుపక్కల ఎక్కడా చెట్లు లేకపోవడంతో కొట్టుకొచ్చిన జీవులు పెద్ద సంఖ్యలో ఆ ఇసుకలోనే సమాధి అయిపోయాయి. అక్కడకు దగ్గర్లోనే ఉండే జాదవ్‌ పాయెంగ్‌ చనిపోయిన వాటిని చూసి చలించిపోయాడు. ఆ ప్రాంతంలో చెట్లను పెంచితే ఆ పరిస్థితి రాదని అర్థమైంది. దాంతో పదహారేళ్ల వయసులో ఇంటినీ వూరినీ వదిలేసి, అరుణ చపోరి ప్రాంతంలోని ఆ దీవిలోనే ఉంటూ రోజూ అక్కడ కొత్త మొక్కల్ని నాటుతూ, నది నుంచి నీళ్లు తెచ్చి పోస్తూ ఉండేవాడు. నదీ తీరం కావడంతో నేలలో సారం లేక మొక్కలు బతికేవి కాదు. దాంతో వూళ్లొ నుంచి ఎర్ర చీమలూ వానపాముల్లాంటి వాటిని తీసుకొచ్చి అక్కడ వేసేవాడు. ఆ కష్టం ఫలితంగా 1360 ఎకరాల విస్తీర్ణంలోని ఇసుక దీవి ‘మొలాయి ఫారెస్ట్‌’గా మారింది. ‘మొలాయి’... పాయెంగ్‌ చిన్నప్పటి పేరు. అందుకే, దానికాపేరు వచ్చింది. ఇందులో ఇప్పుడు పులులూ ఏనుగులూ ఖడ్గ మృగాలూ, అడవి దున్నల్లాంటి ఎన్నోరకాల ప్రాణులు ఆశ్రయం పొందుతున్నాయి. ఈ పర్యావరణ ప్రేమికుడిని 2015 లో పద్మశ్రీ కూడా వరించింది.

Courtesy: Eenadu 

No comments:

Post a Comment