Friday 28 November 2014

29-11-2014, శనివారం, శ్రీ కాలభైరవ అష్టమి

29-11-2014, శనివారం, మార్గశిరశుద్ధ అష్టమి, శ్రీ కాలభైరవ అష్టమి. పిలిచిన పలికే దైవం, భక్తుల భాధాలను, గ్రహపీడలను, రోగాలను నయం చేసే శక్తి, కర్మబంధాల నుంచి విమోచనం కలిగించగల దైవం శ్రీకాలభైరువుడు. అటువంటి కాలభైరవ స్వామికి ప్రీతికరమైన, విశేషమైన రోజు కాలభైరవాష్టమి. ఆ విశేషాలు తెలుసుకుందాం.  


మార్గశిర మాసంలోని కృష్ణపక్ష అష్టమి- ‘‘కాలభైరవాష్టమి’’. పరమ శివుడి వల్ల కాలభైరవుడు ఆవిర్భవించిన రోజే ‘కాలభైరవాష్టమి’. లయకారుడైన పరమశివుడివల్ల ఆవిర్భవించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి ఐదవ శిరస్సును ఖండించిన కాశీ క్షేత్రంలో క్షేత్ర పాలకుడు
గా కొలువుదీరిన దేవడు - కాలభైరవుడు. శ్రీకాలభైరవుడు ఆవిర్భవించిన ‘‘కాలభైరవాష్టమి’’ పర్వదినమును జరుపుకుని కాలభైరవుడిని పూజించాలని శాస్తవ్రచనం.

కాలభైరవస్వామి ఆవిర్భవానికి సంబంధించి ‘‘శివపురాణం’’లో ఆసక్తికరమైన పురాణగాధ వుంది. పూర్వం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడికి శివుడికి మధ్య ఒక వివాదం ఏర్పడింది. బ్రహ్మదేవుడు శివుడివద్దకు వెళ్ళి - ‘‘నేనే సృష్టికర్తను... పరబ్రహ్మ స్వరూపుడను... నేను చెప్పినట్లుగానే మీరందరూ నడుచుకోవాలి’’ అని పలికాడు. శివుడు అందుకు వ్యతిరేకించాడు. దీనితో ఇద్దరి మధ్య వాదం ప్రారంభమై చాలాసేపు వారిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. బ్రహ్మదేవుడు మధ్యన వున్న తన ఐదవ శిరస్సుతో శివుడిని తూలనాడడం ప్రారంభించాడు. దీనితో కోపోద్రిక్తుడైన శివుడు హూంకరించాడు. ఆ హూంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది. మహోన్నతకాయముతో... మూడు నేత్రాలతో త్రిశూలము, గద, ఢమరుకము వంటి వాటిని చేతులతో ధరించిన ఆ భయంకర రూపుడే - శ్రీకాలభైరవుడు.

ఈ విధంగా శివుడి హూంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని శివుడిని కోరాడు. శివుడి ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుడి ఐదు శిరస్సులలో మధ్యనవున్న ఐదవ శిరస్సును ఖండించాడు. దీనితో బ్రహ్మదేవుడి గర్వం అణిగిపోయింది. అనంతరం శ్రీకాలభైరవుడు లయకారుడైన శివుడి ముందు నిలబడగా- ‘‘నీవు బ్రహ్మదేవుడి శిరస్సును ఖండించడంవల్ల నీకు బ్రహ్మహత్యాపాతకం సోకింది. కనుక నీవు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చేయమని సలహాయిచ్చాడు. బ్రహ్మహత్యాపాతకమును తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించినా తనకు సోకిన బ్రహ్మహత్యాపాతకము తొలగకపోవడంతో కాలభైరవుడు శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించాడు. కాలభైరవుడి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు -
‘‘కాలభైరవా! నీవు శివుడి పుత్రుడవు కనుక శివుడితో సమానుడవు. బ్రహ్మ దేవుడి గర్వమును అణుచుటకు జనించినవాడవు. నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు. కనుక నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు... కాశీ క్షేత్రంలో అడుగుపెట్టినంతనే నీ బ్రహ్మ హత్యాపాతకం భస్మమైపోతుంది’’ అని సలహాయిచ్చాడు.

దీనితో- కాలభైరవుడు కాశీ నగరానికి చేరుకోవడంతోనే బ్రహ్మహత్యాపాతకం తొలగిపోగా, బ్రహ్మకపాలాన్నీ కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మకపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే - నేటి కాశీ క్షేత్రంలోని ‘‘కపాల మోక్షతీర్థం’’. తర్వాత కాశీక్షేత్రంలో శ్రీకాలభైరవుడు కొలువుదీరి క్షేత్రపాలకుడుగా పూజలందుకుంటూ వున్నాడు. కాలభైరవుడిని కాశీలో ముందుగా దర్శించే ఆచారంతోపాటూ... కాశీకి వెళ్ళి వచ్చినవారు ‘‘కాశీ సంతర్పణం’’ కంటే ముందుగా కాలభైరవ సంతర్పణ చేయడం శ్రీ కాలభైరవస్వామి వారి మహత్మ్యానికి నిదర్శనం.

ఈ విధంగా ఆవిర్భవించిన కాలభైరవ స్వామి వారి జన్మదినమైన ‘‘కాలభైరవాష్టమి’’ నాడు శ్రీకాలభైరవుడిని స్మరించడం, పూజించడంవల్ల సకల పుణ్యాలు కలగడంతోపాటూ... సర్వవిధాలైన భయాలు నశిస్తాయి. కాలభైరవాష్టమి నాడు తెల్లవారుఝామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేయాలి. కాలభైరవుడి విగ్రహాన్నిగాని, చిత్రపటాన్ని గానీ పూజామందిరంలో ఏర్పాటుచేసుకుని ముందుగా గణపతిని పూజించి తర్వాత శ్రీకాలభైరవస్వామి వారిని షోడశోపచారము, అష్టోత్తరాలతో పూజించి, శక్తిమేరకు నైవేద్యమును సమర్పించవలెను. ఆ రోజూ మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రిపూట ఉపవాసం వుండవలెను. ఆదిశంకరాచార్యుల వారు రచించిన ‘‘కాలభైరవాష్టకమ్’’ను పారాయణం చేయాలని శాస్తవ్రచనం. ఈ విధంగా కాలభైరవాష్టమిని జరుపుకొనడంవల్ల సర్వవిధాలైన భయాలు తొలగిపోయి అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి. కాలభైరవాష్టకమును నిత్యం పఠించడం కూడా మంచిదే!

Source: ఆంధ్రభూమి http://archives.andhrabhoomi.net/archana/k-184

Thursday 27 November 2014

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి తత్త్వం

అవ్యక్తం, వ్యక్తం, మహత్, అహంకారం - ఈ నాలుగు పంచభూతాత్మకమైన సృష్టికి ఆధారమైనవి. ఇందులో అవ్యక్తం - పరమశివుడు, వ్యక్తం - పార్వతీ దేవి, మహత్ తత్త్వం గణపతి, అహకారం కుమారస్వామి. నిజానికి ఒక పరతత్వం యొక్క నాలుగు భూమికలివి.

'అహంకారం' అంటే లోకంలో అనుకునే గర్వం అను భావం కాదు, 'నేను' అనే స్పృహని అహంకారం అంటారు. ఈ సృష్టి వ్యష్టిగానే కాక, సమిష్టిగా కూడా ఉంటుంది. ఈశ్వరుని పరమగానూ ఈ భావం ఉంటుంది. ఇక్కడి నుంచే సృష్టి విస్తృతి ప్రారంభమవుతుంది.

చైతన్యం ఒక్క లక్షణం-అహంకారం. ఈ సృష్టిలో కృతిమంగా, యాంత్రికంగా, వైజ్ఞానిక సాంకేతికంగా ....... మానవుని మెదడు వంటి జ్ఞాపకశక్తి గల యంత్రన్ని తయార్ చేయవచ్చు. కానీ దానికి 'నేనీ పని చేస్తున్నాను' అనే అహంభావం - స్పందన ఇవ్వలేం. అది కేవలం స్వాభావికమైన సృష్టి లక్షణం. అనుభూతులకీ, ఆలోచనలకీ, స్పందనలకీ, కేంద్రం ఈ 'అహం' తత్త్వమే.

ఈ అహంతత్త్వానికి ప్రతీక - సుబ్రహ్మణ్యుడు. రహస్యంగా అందరిలో ప్రకాశించే పరమాత్మ చైతన్యమిది కనుక 'గుహః' అని స్వామిని అన్నారు. జ్ఞానలక్షణం గల తత్త్వం కనుక గురుగుహ అన్నారు.

అమోఘమైన శివతేజాన్ని ధరించిన తత్త్వం కనుక 'శక్తిధరుడు' అని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారిని అన్నారు.

- బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ

Wednesday 26 November 2014

సుబ్రహ్మణ్య షష్ఠి

మార్గశిర శుద్ధ షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆయుధం శక్తి, అది విజ్ఞానానికి, తెలివికీ ప్రతీక. పదునైన ఈటెను ఆయుధంగా ధరించి, సాధకులు తాము సాన చేసేందుకు ఉపకరించే మనస్సును, ఏకాగ్రతలో నడుపవలెననిన, కుశాగ్రబుద్ధితో చరించవలెనన్న భావాన్ని కలిగించే జ్ఞాన వైశిష్ట్యం కలవాడు. పాము కాల స్వరూపం కనుక జ్ఞాన స్వరూపుడైన స్వామి కాలాతీతుడు. ఆయన సన్నిధిలో ద్వేషాలు, దోషాలు కలిగేందుకు వీలులేదని సత్యవాహనంలోని అంతరార్థం.

శివుడు ధ్యాననిమగ్నుడై ఉన్న సమయంలో తపస్సును భగ్నం చేయడానికి మన్మథుడు కామ శరములు ప్రయోగించగా ఆగ్రహించిన శివుడు తన జ్ఞాన నేత్రం తెరవగనే మన్మథుడు భస్మమైయినాడు. శివుని జ్ఞాన నేత్రంనుండి కదలిన జ్ఞానాగ్ని మన్మథుని మసి చేసి ఆకాశ మార్గాన పయనిస్తుండగా, వాయువు సంగ్రహించి, మోయలేక అగ్నిదేవునికి ఇవ్వగా, అగ్నిదేవుడు ఆ దివ్య తేజస్సును గంగాజలమందు వదిలివేయగా, ఆ తేజస్సును భరించలేని గంగా, రెల్లుగడ్డి పొదనందు పడవేయగా ‘కుమారస్వామి’ ఆవిర్భవించాడు.

శ్రీ సుబ్రహ్మణుని రెల్లు గడ్డినందు జన్మించిన పిదప ఆరుగురు కృత్తికలు పెంచారని అందుకే ఆయనకు షట్ ముఖులు వచ్చి ‘షణ్ముఖుడు’ అనే పేరువచ్చింది. కృత్రికలచే పెరిగినవాడుకనుక ‘కార్తికేయుడు’ అయ్యాడు. ‘‘కృత్తికానామ్ అపత్యం పుమాన్ కార్తికేయం’. కృత్తికా నక్షత్రానికి సంబంధించిన సంతాన పుత్రుడెవరో ఆయనే కార్తికేయుడు. కృత్తిక అంటే కత్తెర అని అర్థం. ఈ శరీరాన్ని ఆ కృత్తిక కృత్రికా నక్షత్రానికి తగినట్లు ఆరు చోట్ల కత్తిరించబడిన వస్తువు ఏడు ముక్కలయింది. ఆ ఏడు ముక్కలే శరీరంలో కనిపించే సప్త చక్రాలు. మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరన, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారాలు.

శ్రీ మహావిష్ణువు లేక శివుడు పరమ పురుషుడు, మహాలక్ష్మీ లేక ఉమాదేవి అవ్యక్తశక్తి. వీరిరువురి సమైక్య, సమన్వయ తత్వమూర్తి కుమారస్వామి అని స్కంద పురాణం తెల్పుతోంది. కుమారస్వామిని ఆరాధిస్తే శివశక్తులను, లక్ష్మీనారాయణులను కలిసి ఆరాధించినట్లే. ప్రకృతి పురుషుల ఏకత్వం స్వామితత్వం. షట్కోణ యంత్రం షణ్ముఖ తత్వానికి ప్రతీక. ద్వికోణాల సంగమం ఊర్థ్వంగా సాగే త్రికోణం శివతత్వం, అధోముఖంగా సాగే త్రికోణం శక్తితత్వం. ఈ శివశక్తుల సంకేతమైన త్రికోణాల సంగమం షట్కోణం. ఈ రెండు త్రికోణాల వల్ల ఏర్పడ్డ షట్కోణాలు షణ్ముఖాలకు ప్రతీకలు.

మార్గశీర్ష మాసంలో శుద్ధ షష్ఠి, అమావాస్య వెళ్లిన ఆరవ రోజును సుబ్రహ్మణ్యషష్ఠి అని, ‘సుబ్బరాయ్ షష్ఠిగా, స్కంద షష్ఠిగా జరుపుకుంటారు. శ్రీ సుబ్రహ్మణ్యుడంటే ‘సు’ అంటే మంచి, ‘బ్రహ్మణ్యుడు’ అంటే వికాసము, తేజస్సు కలవాడని అర్థం.

సర్ప, రాహు, కేతు దోషాలున్నవారు ఉపవాస వ్రతాన్ని పాటిస్తూ షోడశోపచారములతో అర్చించడంవల్ల సత్ఫలితాలు పొందుతారని సంతాన భాగ్యానికి నోచుకోని స్ర్తి, పురుషులు ఈ రోజున సర్పపూజలు చేసి, వెండి పడగలను పుట్టలో వేసినట్లైతే సత్‌సంతాన యోగ భాగ్యం కల్గుతుందనే విశ్వాసం. మంత్రగాళ్ళు ఈ రోజున స్కందుని ఆరాధించి మంత్రాన్ని వశ్యం చేసుకునే శక్తిని పొందుతారు. బ్రహ్మచారియైన బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్యస్వామి స్వరూపంగా భావించి భోజనం పెట్టి పంచెల జతను తాంబూలంతో ఉంచి ఇవ్వడం ఉత్తమం.

ఈ స్వామి అర్చనవల్ల కుటుంబంలో శాంతి, సౌఖ్యాలు, ఆయురారోగ్యాలు అభివృద్ధి చెందుతాయి.

Source: http://archives.andhrabhoomi.net/serial-special/manchi-maata-281 

Tuesday 25 November 2014

మార్గశిర లక్ష్మీవారం (గురువారం)

ఓం నమో లక్ష్మీనారాయణాయ

మార్గశిర లక్ష్మీవారం (గురువారం) కధ

ఒకనాడు నారదుడు, పరాశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సేదతీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆ గ్రామంలో 4వర్ణాల వారూ ఇళ్ళను గోమయం (ఆవుపేడ) తో అలికి, ముగ్గులు వేశారు. స్త్రీలందరూ తలంటుస్నానం చేసి, కొత్త బట్టలు ధరించారు లక్ష్మీ పూజ చేయడానికి. 4వర్ణాలవారు కలిసి ఒక చోట చేరి, లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తుండగా, వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో "మహర్షి!ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి? నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతుహలంగా ఉంది. ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి" అన్నారు.

గురువారం చేసే ఈ పూజను లక్ష్మీపూజ అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిరమాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది. లక్ష్మీ దేవికి చాలా ప్రీతికరమైనది అన్నారు పరాశర మహర్షి.

నారదుడు "మహనీయ,ఈ పూజను ఇంతక ముందు ఎవరినా చేశారా? చేస్తే ఎవరు చేశారో, వారికి ఏ ఫలం కలిగిందో తెలియజేయండి " అనగా,పరాశరుడు ఈ విధంగా చెప్పాడు.

ఒకనాడు ఒక లక్ష్మీవారం విష్ణూపాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో "స్వామి ఈ రోజు మార్గశిర లక్ష్మీవారం. ప్రజలు నా వ్రతం చేసే రోజు. మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసే వారిని అనుగ్రహిస్తాను " అని పలికింది. విష్ణుమూర్తి సరే అనగా సర్వాలంకృతభూషితయై భూలోకానికి పయనమైంది లక్ష్మీ దేవి.

ఒక ముసలి బ్రహ్మణ స్ర్తీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటిముందుకు వచ్చి "అవ్వా! ఈ రోజు మార్గశిర గురువారం, లక్ష్మీ పూజ చేసే రోజు. ఇల్లు గోమయంతో అలికి ముగ్గుపెట్టలేదేంటి?" అన్నది. అప్పుడు ఆ ముసలి స్త్రీ "అమ్మా! ఆ వ్రతం ఏమిటి? ఏలా చేయాలి? నువ్వు చెబితే నేను కూడా చేస్తాను" అని పలుకగా మహలక్ష్మీ మందహాసంతో ఈ విధంగా పలికింది.

"మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి, ఇల్లు గోమయంతో అలికి, ముగ్గులు పెట్టి, లక్ష్మీ దేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి. కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి. దానిని వివిధరకాలైన ముగ్గులతో, బొమ్మలతో అందంగా తయారుచేయాలి. శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకుని, దానిని కడిగి దానిమీద కొత్త ధాన్యం పోయాలి. దాని మీద కొలతపాత్రనుంచి, పసుపునీటితో కడిగిన పోకచెక్క (వక్క) ను ఉంచాలి. తెల్ల ధాన్యాన్ని ఈ మాసంలో కొలవాలి. మనసులో కోరికను చెప్పుకుని, కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలతపాత్ర మీద పోయాలి. ఎరుపురంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి, ఎర్రని పూలతో పూజించి శ్రీమహాలక్ష్మిని తలచుకుని దీపారాధన చేయాలి. మొదటపాలు నైవేధ్యంగా పెట్టాలి. తరువాత నూనె వాడకుండా,నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవెధ్యంగా పెట్టాలి.ఇది ఒక విధానం".

లక్ష్మీదేవి ఆ అవ్వతో రెండవ విధానం ఈ విధంగా చెప్పింది. "రెండవ విధానం చాలా సులభమైనది. మార్గశిర శుక్ల దశమి తిధి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతమునే (గత భాగంలో చెప్పుకున్నది)  చేస్తే తప్పక సిరి వస్తుంది. ఈ వ్రత నైవెధ్యం పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మికటాక్షం లభించదు. మనసును నిర్మలంగా ఉంచుకుని, పదిమందిని పిలిచి ఈ వ్రతం చేసి, పసుపుకుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మి తాండవిస్తుంది.

ఈ వ్రతం మాత్రమే కాదు, మరికొన్ని ఆచరించాలి అవ్వ. గురువారం ఉదయమే లేచి, పొయ్యి బూడిద తీయకపోయిన (మనమైతే గ్యాస్ స్టవ్ కడగకపోతే), ఇల్లు వాకిలి తుడవకున్నా ఇంట లక్ష్మీ నిలువదు. ఏ స్త్రీ గురువారం శుచిగా, మడివస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మీ స్థిరంగా ఉంటుంది. ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో, కొడుతుందో, ఇల్లువాకిలి ఊడవదొ (చిమ్మదొ), అంట్లు (ఆహారం తీసుకున్న గిన్నెలు) కడగదో, ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ సాయంకాల వేళ గడపకు రెండువైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మీ నిలువదు. అంతేకాదు ఆ ఇంట ధనానికి, సంతానానికి హాని కలుగుతుంది. అదే విధంగా గురువారం ఉడకని పదార్ధాలు, నిషిద్ధ పదార్ధాలు తినే ఇంట, ఆశుభ్రప్రదేశాలలో తిరగడం, అత్తమామాలను ధూషించడం, సేవించకపోవడం చేసే స్త్రీ ఇంట లక్ష్మీ పాదం కూడా పెట్టదు. భోజనము ముందు, తరువాత కాళ్ళు, చేతులు, ముఖము కడగని వారి ఇంట లక్ష్మి కనిపించదు. ఇతరులతో మాట్లాడుతూ, ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా, అసంధర్భంగా, గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మీ ఉండదు.

ఏ స్త్రీ అందరి చేత అభిమానింపబడుతుందో, గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మీ ఉంటుంది. ఏ స్ర్తీ గురువారం దానధర్మాలు, పూజలు చేయదో, భర్తతో గోడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మురాలిగా జీవిస్తుంది. గురువారం, అమావాస్యా, సంక్రాంతి (ప్రతి నెల సంక్రమణం జరుగుతుంది) తిధులలో నిషిద్ధ పదార్ధాలను తినే స్త్రీ యమపురికి (నరకానికి)  పోతుంది. జ్ఞానంతో స్త్రీ పైన చెప్పబడ్డ 3 తిధులలో నిషిద్ధపదార్ధములను తినకుండా, నక్తం (ఒంటిపూట, ఒకపొద్దు)  ఉంటుందో, లక్ష్మిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధన ధాన్య పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లుతుంది. ప్రతి స్త్రీ తాను నిత్యం ఆచరించే పనులు ఆధారంగా చేసుకునే లక్ష్మి అనుగ్రహం ఉంటుంది. ప్రతి రోజు ఉదయమే నిద్రలేచి ముఖం కడుక్కోవాలి (బ్రష్ చేసుకోవాలి). అలా చేయని స్త్రీ ముఖం చూస్తేనే మహా పాతకాలు కలుగుతాయి. భుజించే సమయంలో పడమర, దక్షిణం దిక్కులకు కూర్చుని (ముఖం పెట్టి)  భోజనం చేయకూడదు. అలాగే నిత్యం దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయడం తగదు. చీకటి పడిన తరువాత తలకునూనె రాయకూడదు. కట్టి విప్పిన బట్టలు, మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేయడమే పెద్ద దరిద్రం. భర్త అనుమతి తీసుకోకుండా అందరికి ఇంటికి తిరిగే స్త్రీ ఇంట, భర్త మాట వినని స్త్రీ ఇంట, దైవం యందు, బ్రాహ్మాణుల యందు భక్తి విశ్వాసాలు లేనటువంటి, పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇళ్ళు స్మశానాలతో సమానం. అందువల్ల అక్కడికి లక్ష్మీ దేవి రాదు. నిత్యదరిద్రం ఆ ఇంట తాండవిస్తుంది" అని లక్ష్మీ దేవి ఆ ముసలి బ్రాహ్మణస్త్రీకి వివరించి ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసిరావడానికి బయలుదేరింది.

ఆ సమయానికి ఆ గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండడం చూసి లక్ష్మీదేవి అసహ్యించుకుంది. ఆ ఊరి చివరకు వెళ్ళింది. అక్కడ ఒక పేదస్త్రీ ప్రతి రోజు ఇల్లును గోమయంతో అలికి, ముగ్గులు పెట్టేది. బియ్యపు పిండితో ముగ్గేసి లక్ష్మీ దేవి పాదముద్రలను వేసి, లక్ష్మీ దేవి విగ్రహం దగ్గర నిత్యం దీపం పెట్టి, ధూపం వేసి, నైవెధ్యాలు పెట్టి, పద్మాసనంలో కూర్చుని నిత్యం లక్ష్మినే ఆరాధించేది ఆ పేద స్త్రీ. ఆమె భక్తికి మెచ్చిన మహా లక్ష్మీ ఆమె ఇంట పాదాలు మోపింది. ఓ భక్తురాలా! నీ భక్తి మెచ్చాను. వరం కోరుకో, ప్రసాదిస్తాను అని పలికింది. సాక్షాత్ లక్ష్మీ దేవిని చూడడంతో ఆ స్త్రీ నోట మాట రాకా ఏ కోరిక కోరలేదు. అప్పుడు లక్ష్మీదేవి "నీవు కోరకుండానే నేను వరాలు ఇస్తున్నాను. నీవు మరణించేవరకు సకలసంపదలను అనుభవుస్తావు. మరణం తరువాత వైకుంఠాన్నిచేరుతావు" అని వరాలిచ్చింది. నా వ్రతం విడువకుండా చేయి, విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికింది. మహా లక్ష్మి చెప్పిన విధంగానే ఆ స్త్రీ లక్ష్మిని నిత్యం పూజించి సకల సంపదలు, భోగబాగ్యాలు, ఐదుగురు కూమారులతో ఆ స్త్రీ జీవితం ఆనందంగా గడిపింది"  అంటూ మహర్షి పారాశరుడు నారద మునీంద్రుల వారితో పలికారు.

శ్రీ మహాలక్ష్మీచే స్వయంగా చెప్పబడిన ఈ వ్రతం చాలా విశిష్టమైనది.ఈ కధను నిత్యం చదవడం వలన శుభాలు కలుగుతాయి.

ఓం నమో లక్ష్మీనారాయణాయ
శ్రీ మహావిష్ణు సమేత శ్రీ మహాలక్ష్మీ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు
ఓం శాంతిః శాంతిః శాంతిః  

Saturday 15 November 2014

శివుడు గొప్పా? లేక విష్ణువు గొప్పా?

సాధారణంగా శివుడు గొప్పా? లేక విష్ణువు గొప్పా? అనే సందేహం లోకంలో కలుగుతూ ఉంటుంది. అందుకు సంబంధించిన ఒక అధ్బుతమైన కధ ఉంది.

ఒకప్పుడు దేవతలకు రామేశ్వరం అనే పదం ఏ సమాసానికి చెందినది అనే సందేహం కలిగింది. 'రామస్య ఈశ్వరః' అని అంటే రామునికి ఈశ్వరుడు(ప్రభువు) అని అర్ధం వస్తుంది. అది శివాధిక్యం (శివుడే గొప్పవాడని) చెబుతుంది. శివ ధనస్సు విరిచిన రాముడు శివుని కంటే ఏ విధంగా తక్కువ? విష్ణుమూర్తిని అడిగి సందేహ నివృత్తి చేసుకుందాం అని వైకుంఠం వెళ్ళారు దేవతలు. విషయం చెప్పారు, మీరు, ఇంకా శివుడిలో ఎవరు గొప్పా అని అడిగారు. దానికి సమధానంగా విష్ణువు ఇంత చిన్న విషయానికి ఎంతదూరం వచ్చారు? ఈ పదాన్ని చూస్తేనే తెలుస్తోంది, రామస్య ఈశ్వరః, ఈశ్వరుడే రామునికి అధికారి, నాకంటే శివుడే గొప్పవడు అని అన్నాడు విష్ణువు.  

ఈ విష్ణువు వినయంతోనో, అహంభావం ఉండకూడదనే ఉద్దేశ్యంతోనో, మొహమాటంతోనో ఇలా చెప్పి ఉంటాడు అని దేవతలు భావించి, తమ సందేహ నివృత్తి కోసం కైలాసానికి బయలుదేరారు. దానికి సమాధానంగా శివుడు ఇందులో సందేహాఇంచడానికి ఏముంది? రాముడె ఈశ్వరుడుగా గలవాడు (రాముడు (విష్ణువు) తనకు అధికారి అని, విష్ణువు తనకంటే గొప్ప అని) అన్నాడు.

వీళ్ళిద్దరితో పెట్టుకుంటే కుదరదు అని, దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారుట. వీరి బాధ విన్న బ్రహ్మగారు "రామేశ్వరుడంటే రాముడొకడూ, ఈశ్వరుడొకడు అని అర్దం కాదయ్య, రాముడే ఈశ్వరుడు, ఈశ్వరుడే రాముడు" అన్నారు.    

విష్ణుస్తత్పురుషం బ్రూతే బహువ్రీహిం మహేశ్వరః |
ఉభయోరప్యతృప్తానా మాత్మభూః కర్మధారయమ్ ||

అసలు విళ్ళిద్దరికి బేధం లేదు అని బ్రహ్మగారు సెలవిచ్చారు. అందుకే శ్రుతి అంటుంది

శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే |
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః ||

శివుడే విష్ణువు, విష్ణువే శివుడు, శివుడి హృదయం ఏమిటని పరిశీలన చేస్తే విష్ణువు ఉంటాడు, విష్ణు హృదయాన్ని పరిశీలిస్తే శివుడు ఉంటాడు. అందుకే శాస్త్రం శివుడిని దూషిస్తే అది విష్ణువుకు కోపం కలిగిస్తుందని, విష్ణువును దూషిస్తే, వారు శివుని ఆగ్రహానికి లోనవుతారని చెప్తుంది.

శివుడు, విష్ణువు రెండుగా కనిపిస్తున్న ఒకే శక్తి. ఇద్దరూ ఒక్కటే. శివుడు నిత్యం కళ్ళు మూసుకుని విష్ణువును ధ్యానిస్తే, విష్ణువు నిత్యం శివనామస్మరణ చేస్తాడు. వారిద్దరిని కలలో కూడా వేరుగా భావించరాదు.

సేకరణ : బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి ప్రవచనం

Friday 14 November 2014

ఉపవాసం

కార్తీకామాసంలో ఉపవాసాల మాసం. ఉపవాసం అంటే దగ్గర ఉండడం అని అర్ధం. భగవంతునికి దగ్గరగా ఉండడమే ఉపవాసం. మనం నిత్య జీవితంలో అనేక పనుల వల్ల భగవంతుని మీద ఎక్కువ సమయం మనసు నిలుపలేము. అందుకే ఏ ఏ తిధులలోనైతే భగవంతుడి అనుగ్రహాన్ని మనిషి గ్రహించగలడో, అంతరిక్షశాస్త్రాన్ని, ఖగోళశాస్త్రాన్ని అనుసరించి, ఏ రోజులలో ఆహారం లోపలికి తీసుకోవడం తగ్గిస్తే, ఆరోగ్యం రక్షింపబడుతుందో, ఆ రోజులలో ఉపవాసం చేయమని మన పెద్దలు సూచించారు. ఉపవాసం యొక్క ప్రధాన లక్ష్యం మనం, మన మనసు భగవంతుని వైపు తిరగడం.

మనం ఆహారం తీసుకున్నాకా, అది అరగాలంటేశక్తి కావాలి, మనసు కూడా ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తుంది. మనం తిన్న ఆహారం అరిగేవరకు మనసు జీర్ణక్రియ మీద కేంద్రీకృతమవుతుంది, మీరు గమనంచండి, ఆహారం అరగకపోతే, మనసు ఏదోలా ఉంటుంది.

ఉపవాసం ఉన్న రోజున ఆహారం మానేయడం వలన, ముందు వంట పని తప్పుతుంది, వంట ఒక్కటి ఆగిపోతే, మళ్ళీ తరువాత గిన్నెలు శుభ్రపరుచుకోవడం, సర్దుకోవడం లాంటి పనులు ఉండవు కనుక సమయం మిగిలిపోతుంది. ఆహారం మానేస్తాం కనుక, మనసును దైవం వైపు తిప్పే శక్తి వస్తుంది. మనసు దైవం వైపు తిరిగితే, మనం చేసే ఆలోచనలు మంచి మార్గాన్ని సూచిస్తాయి, కష్టాలను ఎదుర్కునే మానసిక శక్తిని ఇస్తాయి. అన్నిటికంటే ముందు మనం ఆధ్యాత్మికంగా పురోగతిని సాధిస్తాం.

ఉపవాసానికి కొన్ని నియమాలు ఉంటాయి. కానీ ఉపవాసం పూర్తిగా ఉండలేనివారు బాధపడనవసరం లేదు. అమ్మో! ఆహారం తీసుకోకుండా ఉండలేమండీ అని భయపడనవసరం లేదు. కొందరైతే, అసలు ఉపవాసం చేయడం కూడా మానేస్తారు. అదేం అవసరం లేదు. రోజు తినే ఆహారం కాకుండా పళ్ళు, పాలు వంటివి ఉపవాసం రోజు తినవచ్చు అంటుంది శాస్త్రం. గోధుమ రవ్వ ఉప్మా తినచ్చని కొందరు పెద్దలు చెప్తారు.

నియమాలు పాటించడం ముఖ్యమే అయినా, అన్నప్రాసన రోజే ఆవకాయ తినలేము కదా, పుట్టగానే పరిగెత్తలేం కదా. అలాగే, ఒక్కసారిగా ఆహారం మానేయడం వలన కొందరు ఇబ్బందిపడతారు. కాబట్టి రోజు తినే ఆహారం కాకుండా, గోధుమ రవ్వ ఉప్మా తినండి, పచ్చి కూరలు తినండి, పళ్ళరసాలు త్రాగండి. మరీ కడుపు నిండుగా కాదు కానీ, మీ ఆకలిని తట్టుకోవడానికి తీసుకోండి. కానీ మీరు ఉపవాసం చేస్తున్నారన్న సంగతి మాత్రం గుర్తుంటే చాలు. మీ మనసులో దైవం మెదులుతుంటే చాలు. మీరు లోకాన్ని కాదు దైవాన్ని మెప్పించాలి, దైవానికి భక్తి కావాలి. ఇలా, ఏదో ఒక రకంగా ఉపవాసం ఉండడం ప్రారంభించండి. మనం ప్రయత్న పూర్వకంగా, మన మనసును దైవం వైపు తిప్పాలి. అలా తిప్పడమే ఉపవాసంలోని ఆంతర్యం.

మీరు ఒక్కసారి మీ ప్రయత్నంతో ఆయన వైపుకు తిరగడం ప్రారభిస్తే, ఇక మిమ్మల్ని ఆయన పూర్తిగా తన వైపుకు తిప్పుకుంటాడు, నియమబద్ధంగా ఉపవాసం చేసే శక్తిని ప్రసాదిస్తాడు, జీవితాన్ని మార్చేస్తాడు. కొన్నాళ్ళకి మీరే శాస్త్రం చెప్పినట్టుగా ఉపవాసం చేయడం ప్రారంభిస్తారు.

కనుక ఏదో ఒక విధంగా ఉపవాసం ఉండడం మొదలుపెట్టండి.

Thursday 13 November 2014

శివాలయ దర్శనం - ప్రదక్షిణ విధానం : వివిధ ఆశ్రమాలవారు అనుసరించవలసిన పద్ధతులు

శివాలయ దర్శనం - ప్రదక్షిణ విధానం : వివిధ ఆశ్రమాలవారు అనుసరించవలసిన పద్ధతులు

బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు ప్రవచనం


Wednesday 12 November 2014

స్థావర, జంగమ లింగాలు

శివుడిని మూర్తి రూపంలో కంటే లింగరూపంలో ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలు విశేషంగా ఉంటాయి. పరమేశ్వరుడి విగ్రహాన్ని పూజించేవారికంటే, శివలింగారాధన చేసేవరిలో తేజస్సు, శక్తి అధికంగా ఉంటాయని కృష్ణపరమాత్మ మహాభారతంలో చెప్తారు. మనకు లోకంలో చాలా రకాల లింగాలు కనిపిస్తాయి. అందులో ఈ రోజు ఒక 2 లింగాల గురించి చెప్పుకుందాం. 

లింగం అంటే గుర్తు, ప్రతిరూపం (Symbol) అని అర్దం. అన్నిటియందు ఆ పరమశివుడు అంతర్యామిగా ఉన్నాడు. ఈ సృష్టి అంతా లింగమే. అందుకే రుద్రం ఈ జగత్తు అంతా వ్యాపించి ఉన్న శివతత్వాన్ని ప్రకటించింది.

కొండలు, పర్వతాలు, నదులు, శిలలు, మొక్కలు, చెట్లు ..... ఇలా కదలనివాటిని స్థావరములు అంటారు. ఈ స్థావరములన్నీ శివస్వరూపం అంటున్నది శివ పురాణం. అందుకే ఇవన్నీ స్థావర లింగాలు అంటున్నది శివ పురాణం. మనం మొక్కలకు నీరు పోస్తే (ఏ చెట్టైనా కావచ్చు), అది కూడా శివార్చనగా భావించి అనుగ్రహం ప్రసాదిస్తాడు పరమశివుడు. అట్లాగే ప్రకృతి వనరులను విచ్చలవీడిగా దోచుకోవడం స్థావర లింగ రూపంలో ఉన్న శివుడికి చేసే అపచారం అయితే ప్రకృతి వనరులను సంరక్షించుకోవడం, అవస
రమైనంత మేర, వృధా చేయకుండా వాడుకోవడం శివుడికి ఇచ్చే గౌరవం. ఇంకా చెప్పాలంటే నీరు వృధా చేయడం కూడా శివుడికి అపచారమే. ఇది దీని కిందే వస్తుంది.        

రెండవది జంగమ లింగం. జంగమాలంటే కదిలేవి అని అర్దం. జంతువులు, మనుష్యులు, పక్షులు, క్రిమికీటకాలు లాంటివి. ఇవి కూడా శివుడి స్వరూపాలే. వీటిని జంగమ లింగాలు / లింగం అంటారు. ఆపదలో ఉన్నవారికి పవిత్ర భావనతో, ఏ ఉపకారం ఆశించకుండా చేసే సాయం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, దైవభావంతో పెద్దలకు, దీనులకు సేవ చేయడం జంగం లింగానికి చేసే అర్చన. ఇక ఇది చలికాలం, అనేకమంది చలికి వణుకుతూ రోడలపై పడుకుంటారు. అటువంటి వారికి దుప్పట్లు పంచడం, ముష్టివారికి కాసింత అన్నం పెట్టడం, చదువు యందు ఆసక్తి ఉన్న పేద విద్యార్ధులకు పుస్తకాలు పంచిపెట్టడం, పీజు కట్టడం కూడా ఈ జంగమ లింగానికి అర్చన క్రిందే వస్తుంది.  

మనకు శివ పూజ చేయాలన్న తపన ఉండాలి కానీ, అందుకు అనేక మార్గాలు చూపించాడు మహాశివుడు.

ఓం నమః శివాయ

Tuesday 11 November 2014

అక్బర్ - బీర్బల్ - 4 ప్రశ్నలు

ఒకప్పుడు అక్బర్ బాదుషా తన మంత్రి ఐన బీర్బల్ను 4 ప్రశ్నలు అడిగెను.......

1.....దేవుడు యెచట నివసించును?

2...అతని పని యేమి?

3....అతడేమి భుజించును?

4...కేవల సంకల్ప మాత్రంచే సమస్తము చేయగలిగి ఉండగా అతడు మానవ రూపము యేల ధరించవలె?..

అప్పుడు బీర్బల్ ఈ క్రింది విధంగా సమాధానాలు ఇచ్చెను..

1....దేవుడు సర్వవ్యాపకుడు,,అతడు పవిత్రులైన తన భక్తుల హృదయంలో కానబడును..నీవు కూడా అతనిని నీ హృదయము నందు గాంచ వచ్చును...

2..అతడు ఉన్నత స్థితియందున్న వారిని పతనమొనర్చి ,,పతితులను ఉన్నత స్థితికి గొంపోవును...

3...అతడు జీవుల యొక్క అహంకారమును భుజించును..

అటు పిమ్మట 4వ ప్రశ్నకు అలోచించి తగిన సమాధానము నొసంగుటకై బీర్బల్ కొంత గడువును కోరెను..
తదంతరము బీర్బల్ అక్బరు యొక్క బిడ్డను రక్షించుచున్న దాది వద్దకువచ్చి ఆమెతో ఇట్లనెను..`ఈ దినము నాకు నీవు ఒక విషయమై సహకరించవలెను..నేను అక్బరుకు ఒక నిశ్చితమైన వేదాంత ప్రశ్నకు సమాధానము చెప్పవలసి ఉన్నది..అక్బరు ఈ చెరువు వద్దకు తన శిశువుతో ఆడుటకై వచ్చినపుడూ ఆ శిసువును యెచటనైన దాచి ఉంచి, శిశువు యొక్క ఈ బొమ్మను నీ వద్ద ఉంచుకొనుము.. ఆ శిశువు పడిపోవుచున్నట్లు చేసి, ఆ బొమ్మను చెరువులో పారవేయుము.. అప్పుడు జరగనున్న తమాషాను గమనించుము.. దీనినంతటిని నైపుణ్యముతో చేయుము.. నీవు నైపుణ్యత కలదానివని నాకు తెలియును..: అని చెప్పీతడామెకు పదిరూపాయిలు పారితోషికముగా ఇచ్చెను.. ఆమె మిక్కిలి సంతుష్టియై అతను చెప్పినట్లు చేయుటకు అంగీకరించెను..
అక్బరు తన సాయంకాలపు షికారు నుండి తిరిగి వచ్చి చెరువు పక్కనున్న బల్లపై కూర్చుండెను.. అప్పుడు బిడ్డను తీసుకొని రమ్మని దాదిని అడిగెను.. అప్పుడా దాది చెరువు ప్రక్కకు వెళ్ళి బొమ్మబిడ్డను తెస్తూ అది పడిపోవుచున్నట్లుగా నటిస్తూఆ బొమ్మ శిశువును చెరువులో పడవేచెను..
అక్బరు ఆ బిడ్డను రక్షించుటకై చెరువులో దూకుటకు పరుగెత్తెను.. అప్పుడు బీర్బల్ అడ్డము వచ్చి `నీ బిడ్డ ఇచ్చటనే ఉన్నాడు.. దొందర పడకుడు..: అని పలికెను..

బీర్బల్ యొక్క అమర్యాదతో కూడిన ప్రవర్తనకు అక్బరు మిక్కిలి కోపోద్రిక్తుడై అతనిని మంత్రి పదవి నుండి తొలగించి శిక్షించుటకై ఆజ్ఞాపించెను..

నేనిప్పుడు మీ 4వ ప్రశ్నకు అనుభవ పూర్వకమైన సమాధానమొసంగితినని: పలికెను.. మీరు నాపై యెందుకు కోపగించుకొన్నారు.? మీ బిడ్డను రక్షించుటకై అనేకమంది సేవకులుండగా మీ బిడ్డయందున్న వాత్స్చల్యము బట్టి మీరే నీటియందు దూకుటకు సిద్ధపడ్డారు.. అదే విధంగా భగవంతుడు కేవలము తన సంకల్పమాత్రము చేతనే సమస్త కార్యములను చేయు సామర్ధ్యము కలిగి ఉండియూ అతడికి తనభక్తులయందు ప్రేమచే వారికి దర్శనం ఇచ్చుటకై అతడు ఈ భువిపై అవతరించును..ఈ విషయము మీకు అర్ధమైనదా?
ఈ విషయమంతయూ విని అక్బరు మిక్కిలి సంతసించి బీర్బల్కి విలువైన బహుమతులను,వజ్రఖచిత ఉంగరమును ,శాలువాను అర్పించెను..

ఇట్లు భగవంతుడు మానవజాతిని ఉద్ధరించుటకై అవతరించు చుండును....
సేకరణ: Jnana Valli 

Thursday 6 November 2014

అరుణాచల శివ

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా

చిదంబర దర్శనం, తిరువళ్ళూర్‌లో జన్మించడం, కాశీలో మరణించడం, అరుణాచల స్మరణం ముక్తిని ప్రసాదిస్తాయి. మనకున్న పంచభూత శివ క్షేత్రాల్లో అగ్నితత్వానికి ప్రతీకయైన అగ్నిలింగం అరుణాచలంలో ఉంది. ఒకసారి బ్రహ్మ, విష్ణువుల మధ్య వివాదం వచ్చినప్పుడు, ఆ వివాదం తీర్చడానికి, పరమశివుడు ఈ అరుణాచల క్షేత్రంలోనే మహాతేజోవంతమైన అగ్నిలింగంగా తన రూపాన్ని ప్రదర్శించాడని స్థలపురాణం.

అరుణాచలం పర్వతమే పరమశివుడు, పరమశివుడే అరుణాచల పర్వతం. అందుకే ఇక్కడ గిరిప్రదక్షిణం పేరున కొండ చుట్టు ప్రదక్షిణం చేస్తారు. అరుణాచలం పర్వత గుహలలోనే శ్రీ దక్షిణామూర్తి ఇప్పటికి ఉన్నారు. అరుణాచలం ఒక అద్భుతం. ఈ అరుణాచలంలోనే రమణ మహర్షి ఆశ్రమం ఉంది. అరుణాచల పర్వతం మీద కార్తీక పూర్ణిమ రోజు వెలిగించే కార్తీక దీపం చూడడానికి దేశవిదేశాల నుంచి లక్షల మంది జనం తరిలివస్తారంటే తిశయోక్తి కాదు. ఈ రోజు అరుణాచలంలో వెలిగించే జ్యోతే పరమశివుడు. ఈ క్షేత్రంలో శివుడి పేరు అరుణాచలేశవరుడు, అమ్మవారి పేరు అపితకుచాంబిక.

తమసోమా జ్యోతిర్గమయా - ఓ పరమాత్మ, మేము ఈ అజ్ఞానమనే అంధకారం నుంచి జ్ఞానమనే వెలుగులోని వెళ్ళెదము గాకా అన్న ఉపనిషత్ వాక్యానికి ఈ జ్యోతియే నిదర్శనం అని చెప్పవచ్చు. ఈ అరుణాచల కార్తీక దీపాన్ని దర్శనం చేసుకోవడం వల్ల మన మనసుకు జ్ఞానం పొందేలా ప్రేరణ కలుగుతుంది.

చిదంబరంలో శివ దర్శనం అంత సులువు కాదు, తిరువళ్ళురులో జన్మించడం మన చేతిలో లేదు, కాశీలో చావడానికి వెళ్ళినా, అక్కడకు వెళ్ళినవారందరూ అక్కడే మరణించరు, ఈ అరుణాచలాన్ని స్మరించడం మాత్రం మన చేతిలోనే ఉంది. మీరు, నేను అనుకుంటే వచ్చేది కాదు ముక్తి, పైవాడి అనుగ్రహం ఉండాలి. అందుకోసం వాడి అనుగ్రహం పొందాలి. వాడి అనుగ్రహం కోసం నిత్యం అరుణాచలాన్ని స్మరించండి.   
     
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా

Wednesday 5 November 2014

కార్తీక పౌర్ణమి

కార్తీక పౌర్ణమి విశేషాలు
జ్వాలాతోరణం - శివకేశవులకు ప్రీతికరమైన పవిత్ర కార్తీక మాసంలో అత్యంత మహిమాన్వితమైన రోజు కార్తీక పౌర్ణమి. మనకు ఆశ్వీయుజ అమావాస్య దీపావళి అయినట్టు, కార్తీక పూర్ణిమ దేవతలకు దీపావళి అని చెప్తారు. ఈ రోజు చేసే స్నాన, పాన, దాన, దీప దానములతో పాటు చూసినంత మాత్రంగానే అనంతమైన పుణ్యఫలాలు ప్రసాదించే ఉత్సవం "జ్వాలతోరణం".

కార్తీకపౌర్ణమి సాయంత్రం శివాలయాల్లో, ఆలయప్రాంగణంలో, ప్రధాన ఆలయానికి ఎదురుగా రెండు ఎత్తైన కర్రలు నాటి, మరొక కర్రను ఆ రెండింటిని కలుపుతూ అడ్డంగా కట్టి, ఆ కర్రను ఎండుగడ్డితో చుట్టి, ఆ గడ్డిని నిప్పుతో వెలిగిస్తారు. ఇది మండుతూ తోరణ శివలింగంగా ఉంటుంది. దీనికి జ్వాలాతోరణం అని పేరు. దీని క్రింది నుంచి పల్లకిలో శివపార్వతులను దాటిస్తారు, భక్తులు కూడా ఈ జ్వాలాతోరణం క్రింది నుంచి దాటుతారు.

దీనికి సంబంధించి రెండు కధలు ఉన్నాయి.

ఒకటి, త్రిపురాసురలనే 3 రాక్షసులను పరమశివుడు సంహరించింది ఈ రోజునే అని పురాణం చెప్తోంది. అందువల్ల దీనికి త్రిపుర పౌర్ణమి అని పేరు. దుష్టులైన రాక్షసులను సంహరించిన శివుడుం కైలాసానికి చేరగా, తన భర్తకు దృష్టి దోషం (దిష్టి) కలిగిందని భావించిన పార్వతీమాత, దృష్టిదోష పరిహారం కోసం జ్వాలాతోరణం జరిపించింది.

రెండవ కధ అమృత మధనానికి సంబంధించినది. కృతయుగంలో అమృతంకోసం దేవతలు,రాక్షసులు కలిసి క్షీరసముద్రాన్ని చిలికినప్పుడు పొగలు కక్కుతూ హాలాహలం (కాలాకూట విషం) పుట్టింది. హాలాహలం లోకాన్ని నాశనం చేస్తుందన్న భయంతో దేవతలందరూ పరుగుపరుగున పరమశివుడి వద్దకు వెళ్ళి రక్షించమన్నారు. జగత్తుకు తల్లిదండ్రులు పార్వతీపరమేశ్వరులు. లోకహితం కోసం పరమశివుడు దానిని స్వీకరించాడు కానీ మ్రింగితే అయన కడుపులో ఉన్న లోకాలు కాలిపోతాయి, బయటకు విడిచిపెడితే, దేవతలకు ప్రమాదం అని భావించి ఆ విషాన్ని తన కంఠంలోనే పెట్టుకున్నాడు. అప్పుడు శివుడు గరళ కంఠుడు / నీల కంఠుడు అయ్యాడు. ఇది జరిగాక పరమశివునితో కలిసి పార్వతి దేవి కుటుంబసమేతంగా  మూడుసార్లు జ్వాలాతోరణం దాటింది. ఈ జ్వాలాతోరణంలో కాలగా మిగిలిన గడ్డిని పశువుల ఆహారంలోనూ, ధాన్యం నిలువ ఉంచే ప్రదేశంలోనూ పెట్టడం చేత పశువృద్ధి, ధాన్యవృద్ధి జరుగుతుంది.

ఈ జ్వాలాతోరణం దర్శించడం వల్ల సర్వపాపాలు హరింపబడతాయని,ఆరోగ్యం చేకూరుతుందని, అపమృత్యువు నివారింపబడుతుందని శాస్త్రం చెప్తోంది. జ్వాలాతోరణం క్రిందినుండి వెళ్ళడం వలన నరకద్వారా ప్రవేశం తొలుగుతుంది. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ దేహం నుంచి బయటకు రాగానే, ఆ ఆత్మను ఒక కుక్క భై అనే గట్టి అరుపులతో తరుముతుంది, తెలిసినా వాళ్ళు ఎవరు ఉండరు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఆ పరిస్థితిలో దిక్కుతోచని ఆత్మ చీకటిలోకి వెళ్ళిపోతుంది. అయినా ఆ కుక్క వెంటబడడం ఆగదు. అలా చాలా దూరం వెళ్ళాక, దూరంగా ఒక కాంతి కనపడుతుంది. అక్కడికి వెళ్తే తప్పించుకోవచ్చన భ్రమతో ఆత్మ ఆ దిశగా పరుగెట్టి, ఒక భయకరంగా మండుతున్న జ్వాలల తోరణాల నుంచి వెళ్ళి, నరకంలోకి ప్రవేశిస్తుంది. ఆత్మ వెంటపడి తరిమిన్న కుక్క భైరవుడు, శివగణాలలో ఒకడు. అప్పుడు ఆత్మ అనుభవించే బాధా వర్ణనాతీతం. అటువంటి పరిస్థితి రాకూడదని, తన బిడ్డలెవరు బాధపడకూడదని, మన మీద ప్రేమతో జగత్తుకు తండ్రి అయిన పరమశివుడు తనతో కలిసి కార్తీకపౌర్ణమి రోజున జ్వాలతోరణం దాటే వారికి ఈ నరకబాధ నుంచి విముక్తినిస్తాడు. అందుకే ప్రతి శివాలయంలో కార్తీకపౌర్ణమి నాడు విశేషంగా జ్వాలతోరణం జరుపుతారు.

ముఖ్యమైన విధులు: ఈ రోజు చేసే ఉపవాసానికి విశేషఫలం ఉంటుంది. కార్తీక పూర్ణిమ నాడు ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక్క దీపమైనా వెలిగించి ఈ క్రింది శ్లోకం చదవాలి.

కీటాఃపతంగాః మశకాశ్చ వృక్షాః
జలే స్థలే యే నివసంతి జీవాః |
దృష్ట్వా ప్రదీపం న హి జన్మభాగినః
భవంతి త్వం శ్వపచాహి విప్రాః ||

ఈ దీపం చుసిన ప్రభావం చేత కీటకాలు (insects), పక్షులు, దోమలు, చెట్లు,మొక్కలు, ఉభయచరాలు (amphibians) అన్ని కూడా, అవి ఏ ఏ రూపాల్లో ఉన్నాయో, ఆ రూపాల్లోనే అవి మోక్షం పొందాలని, వాటికి మరుజన్మ ఉండకూడదని ప్రార్ధిస్తున్నా అని అర్ధం.ఎంతో పుణ్యం చేసుకుంటే మనకీ జన్మ వచ్చింది, ఈ జన్మలో మనం బుద్ధి ఉపయోగించి, వేదం చెప్పినట్టు బ్రతికి, జ్ఞానం పొంది, మోక్షం సాధించవచ్చు. కానీ, మిగితా జీవులకు ఆ అవకాశం లేదు. మనకు ఈ ప్రకృతిలో ఉన్న జీవరాశి ఏదో ఒక రకంగా ఉపకారం చేస్తూనే ఉంటాయి. వాటికి ప్రత్యుపకారం చేయడం మన ధర్మం. వాటికి ప్రత్యుపకారం చేయడం కోసం, మనకు లాగే అవి భగవంతున్ని చేరుకోవడం కోసం దీపాన్ని వెలిగించి, ఈ స్తోత్రాన్ని చదవాలి.

Tuesday 4 November 2014

కార్తీక పౌర్ణమి - సముద్ర స్నానం

కార్తీకపూర్ణిమ, సముద్ర స్నానం.

శాస్త్రంలో సముద్రస్నానానికి ప్రత్యేకత ఉంది. ఆషాడ, కార్తీక, మాఘ, వైశాఖ పూర్ణిమలకు తప్పకుండా సముద్ర స్నానం చేయాలి. ఈ స్నానం సూర్యోదయానికి పూర్వమే చేయాలి.

కార్తీక మాసంలో చంద్రకిరణాల నుండి అమృతబిందువులు వర్షిస్తాయి, అవి మానసిక, శారీరిక ఆరోగ్యాన్ని ఇస్తాయి. అంతేకాదు, చంద్ర కిరణాలతో మధుమేహానికి ఔషధం తయారుచేసే పద్ధతి మనం దేశంలో ఉంది. ఈ చంద్రకిరణాలు, చంద్రుడి ప్రభావం నీటిపై అధికంగా ఉంటుంది, పూర్ణిమ రోజున మరింత విశేషంగా ఉంటుంది. చంద్ర కిరణ ప్రభావిత నీటిలో చేసే స్నానం అనేక రోగాలను నయం చేస్తుంది. అందుకోసమే కార్తీక పూర్ణిమ రోజున సూర్యోదయానికి పూర్వమే సముద్రస్నానం చేయాలి.

ఇక ఆయుర్వేద పరంగా చెప్పుకుంటే, ఈ రోజు చేసే సముద్రస్నానం చలికారణంగా మన చర్మం మీద ఏర్పడిన పగుళ్ళను, గాయాలను నయం చేస్తుంది. శరీరంలో అధికంగా పేరుకుపోయి బద్దకాన్ని కలిగించే విద్యుత్ అయస్కాంత శక్తిని తొలగిస్తుంది. ఉదర, కాలేయ సంబంధిత రోగాల బారినపడకుండా రక్షిస్తుంది.  

కనుక సముద్ర స్నానం చేయాలనుకునేవారు తగిన ఏర్పాట్లు చేసుకోండి.     

Monday 3 November 2014

కార్తీక శుద్ధ ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి

ఓం నమో లక్ష్మీనారాయణాయ
కార్తీక శుద్ధ ద్వాదశి

కృతయుగంలో ఇదే రోజున దేవతలు - రాక్షసులు అమృతం కోసం మందరపర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా చేసి, పాలసముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారని పురాణ వచనం. అందువల్ల దీనికి చిలుకు ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి అని పేరు.

యోగనిద్ర నుండి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మెల్కొన్న శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా దేవతలతో కూడి ఈరోజు తులసివనం (బృందావనం) / తులసి కోటలోనికి ప్రవేశిస్తాడని,  ఆయన్ను పూజించడానికి దేవతలు, ఋషులు, యక్షులు, కిన్నెర, కింపురుషులు, సిద్ధులు, యోగులు మొదలైనవారంతా వస్తారని బ్రహ్మ దేవుడే చెప్పాడు.

అందువల్ల ఈ రోజు విష్ణుప్రతిమను తులసికోటలో ఉంచి పూజిస్తే సకల పాపాలు నశించి, విష్ణులోకానికి వెళతారని, ఈరోజు చేసిన పూజ, ఎంతటి ఘోరమైన పాపాలను కూడా అగ్నిహోత్రంలో వేయబడిన ప్రత్తిపోగును కాల్చివేసినట్లుగా కాల్చివేస్తుందని పురాణవచనం.

ఉసరి చెట్టు విష్ణుస్వరూపం. తులసి లక్ష్మీ స్వరూపం. ఈ రోజు తులసి - దామోదర వ్రతం చేస్తారు. అంటే తులసి ఉసరిక చెట్లకు కల్యాణం చేస్తారు. ఈ కల్యాణం చేస్తే లక్ష్మీనారాయణులకు కల్యాణం చేసిన ఫలం కలుగుతుంది. ఈరోజున తులసి మొక్క వద్ద దీపం వెలిగించినవారికి విష్ణుకృప కలుగుతుంది. తులసివనంలో శ్రీకృష్ణ విగ్రహం వద్ద ఎవరు దీపారాధన చేస్తారో, వారికి అనంతమైన పుణ్యం లభిస్తుంది. మరణం తరువాత వైకుంఠానికి వెళతారు. ఈ రోజున తులసి వనంలో విష్ణువును పూజించనివారికి పూర్వపుణ్యాలు కూడా నశించి నరకానికి పోతారని, కోటి జన్మల పాటు పాపిగా పుడతాడని, పూజించినవారు స్వర్గానికి వెళతారని, బ్రహ్మహత్యాపాతకం వంటి అనేకమైన మహాపాపాలు కూడా నశించి మహామహా పుణ్యాలు పొందుతారని పురాణం చెబుతోంది. వెలుగుతున్న దీపాల మధ్య తులసివనంలో ఉన్న విష్ణువు లేక ఉసరి చెట్టును కాని చూసి నమస్కరిస్తే వారి కోరికలు సిద్దిస్తాయి.

ఈ రోజున తులసిమొక్క వద్ద తప్పకుండా దీపదానం చేయాలి. ఒక దీపం దానం చేస్తే ఉపపాతకములు నశిస్తాయి. పది దీపాలు దానం చేస్తే శివసానిద్ధ్యం, ఇంతకుమించి దీపాలు దానం చేస్తే స్వర్గలోకానికి అధిపత్యం లభిస్తుందని, బ్రహ్మా మొదలైన దేవతలకు కూడా దీపదానం వల్లనే ఆ వైకుంఠంలో శాశ్వతమైన స్థానం కలిగిందని పురాణంలో కనిపిస్తుంది. దీపం వెలింగిచడానికి ఆవునేయి ఉత్తమము. లేకుంటే నువ్వుల నూనె మాత్రమే వాడాలి. తులసి మొక్క ముందు ముగ్గులు వేసి, దీపాలతో అలంకరించి, తులసి స్తోత్రాలు చదవాలి.                       

Sunday 2 November 2014

భోధన ఏకాదశి, ఉత్థాన ఏకాదశి

ఓం నమో నారాయణాయ

కార్తీక శుద్ధ ఏకాదశి, భోధన ఏకాదశి  


కార్తీకశుద్ధ ఏకాదశికే భోధన ఏకాదశి, దేవ-ప్రబోధిని ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని పేర్లు. ఆషాడ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీమహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగనిద్ర నుండి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్థాన ఏకాదశిగా అయ్యింది. దీనినే హరి-భోధిని ఏకాదశి అని కూడా అంటారు.

తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్యవ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది. మహభారత యుద్ధంలో బీష్ముడు ఈ ఏకాదశినాడే అస్త్ర సన్యాసం చేసి, అంపశయ్య మీద శయనించాడు. యజ్ఞవల్క్య మహర్షి ఈరోజునే జన్మించారు.

ఈ రోజున ఉపవాసం ఉండి, విష్ణువును పూజించి, రాత్రి జాగరణ చేసి, మరునాడు ద్వాదశి ఘడియలు ఉండగానే విష్ణుపూజ చేసి, పారణ చేసి (భోజనం చేసి) వ్రతాన్ని ముగించాలి.

 ఈ ఏకాదశి మహత్యాన్ని గురించి బ్రహ్మదేవునికి నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ స్కందపురాణంలో కనిపిస్తుంది. "ఈ ఏకాదశి పాపాలను హరిస్తుంది. 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది. కొండంత పత్తిని ఒక చిన్న నిప్పు రవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగ ఒక జీవుడు,తన వేలజన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది ఈ ఏకాదశి  ఉపవాస వ్రతం. ఈ రోజు చిన్న మంచిపని (పుణ్యకార్యం) చేసినా, అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితం ఇస్తుంది. ఈ ఏకాదశి వ్రతం చేసినవారికి సాధించలేనివి ఏమి ఉండవు. ఈ రోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం, సంపదలు, ఉన్నతస్థానం కలగడంతో పాటు పాపాపరిహారం జరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞయాగాలు, వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి కోటిరెట్ల పుణ్యం ఒక్కసారైన ఈ ఏకాదశి  ఉపవాస వ్రతం చేసినవారికి లభిస్తుంది" అని బ్రహ్మదేవుడు నారదునితో పలుకుతాడు.

ఇంకా ఈ వ్రతంలో ఒకరికి చేసే అన్నదానం వలన సూర్యగ్రహణసమయంలో పవిత్ర గంగాతీరాన కోటిమందికి అన్నదానం చేసినంత ఫలితం లబిస్తుంది. వస్త్రదానం చేయడం వలన, పండ్లు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇవ్వడం వలన ఈ లోకంలోనే గాక మరణానంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయి. 

ఈ రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు, సిద్దులు, యోగులు అందరూ విష్ణులోకం చేరి కీర్తనలతోనూ, భజనలతోనూ, హారతులతోనూ శ్రీమహావిష్ణువును నిద్రలేపుతారు. అందువల్ల ఉత్థాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికి అపమృత్యు (uncertain death) దోషం తొలగిపోతుందని ధార్మిక గ్రంధాలు చెప్తున్నాయి. అందువల్ల అందరు విష్ణుమూర్తికి హరతి ఇవ్వండి. ఏవైనా కారణాల వల్ల హారతి ఇవ్వడం కుదరకపోతే దేవాలయానికి వెళ్ళండి. అక్కడ స్వామికి ఇచ్చె హారతిని కన్నులారా చూడండి, వీలైతే స్వామికి హారతి కర్పూరం సమర్పించండి. అపమృత్యు (uncertain death) దోషం పరిహారం జరుగుతుంది. స్వామి అనుగ్రహం కలుగుతుంది.

ఓం నమో నారాయణాయ

ఓం శాంతిః శాంతిః శాంతిః