Friday 31 October 2014

సర్దార్ వల్లభాయ్ పటేల్

ఈ రోజు ( 31 అక్టోబరు) భారతదేశ తొలి హోంమంత్రి, ఉక్కుమనిషిగా చెప్పుకునే సర్దార్ వల్లభాయ్ పటేల్గారి జయంతి. 

ఆంగ్లేయుల నుంచి భారత్‌కు స్వాతంత్ర్యం తెచ్చుకున్నా, భారతదేశం మొత్తం ఐక్యంగా లేదు. స్వాంతత్రానంతరమూ కూడా మన దేశంలో 565 సంస్థానలు / స్వతంత్రరాజ్యాలు ఉన్నాయి. చాకచక్యంగా దౌత్యం నడిపి వాటినన్నిటిని సంవత్సర సమయంలోనే, భారతదేశంలో విలీనం చేసిన ఘనత సర్దార్ పటేల్ గారిది. పాకిస్థాన్ కంటే ముందే లక్షద్వీప్ చేరుకుని భారత పతాకం ఎగురవేసి, లక్ష్వద్వీప్ దీవులను భారత్‌లో విలీనం చేశారు. పాకిస్థాన్ గుజరాత్‌లోని జునాగర్హ్, కాశ్మీర్, హైద్రాబాద్‌ల పై పేచి పెడితే, జునాగర్హ్‌లో రెఫరెండం నిర్వహించి, జూనాగర్హ్‌ను భారత్‌లో విలీనం చేశారు.

హైద్రాబాద్‌ సంస్థానంలో ముస్లింలు 10% ఉంటే హిందూ జనాభ 90% ఉండేది. అటువంటి హైద్రాబాద్‌ను నిజాం నవాబు పాకిస్థాన్‌లో విలీనం చేయడానికి చేసిన ప్రయత్నాలను చిత్తు చేశారు. రజాకార్ల పేరుతో హిందువులను ఊచకోత కోస్తూంటే చూడలేక హైద్రాబాద్‌పై సైనిక చర్య జరిపి, హైద్రాబాద్‌ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు. ఇందుకోసం ఆయన అనేక నిందలు పడవలసి వచ్చింది.

ఆ కాలంలో హైద్రాబాద్‌లో కాంగ్రెస్ కంటే కన్యూనిస్ట్‌ల బలం అధికంగా ఉండేది. హైద్రాబాద్‌ను భారతదేశంలో విలీనం చేస్తే అక్కడ కమ్యూనిస్టులు బలపడతారని, కాకుండా అదే స్థితిలో కొన్నాళ్ళు ఉంచేస్తే, నిజాం సర్కార్ కమ్యూనిస్టులను నాశనం చేస్తుందని, ఆ తరువాత మెల్లిగా హైద్రాబాదును భారత్‌లో విలీనం చేసే ప్రయత్నం చేయడం వలన కాంగ్రెస్ రాజకీయ లబ్ధి పొందవచ్చని నెహ్రూ భావించారు. హైద్రాబాద్‌ను భారత్‌లో కలుపుదామని పటేల్ ప్రతిపాదించగా, పటేల్ మతతత్వవాది అని నెహ్రూ విమర్శించారు. కానీ ఉక్కు మనిషి సర్దార్ వీటికి బెదరలేదు. హైద్రాబద్ ప్రజల దీనబ్రతులకు స్వాతంత్ర్యం ఇవ్వాలని గట్టిగా నిర్ణయించుకుని, నెహ్రూ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో తన అధికారశక్తితో హైద్రాబాద్ రాజ్యం చుట్టూ సనికులను దింపి, 5 రోజుల్లో నిజాం హైద్రాబాద్‌ను భారత్‌కు అప్పగించేలా చేశారు. నిజాం హైద్రాబద్‌ను భారత్‌లో కలిపారన్న వార్త రేడియోలో విన్న హైద్రాబద్ జనం సంబరాలు చేసుకున్నారు.

నిజానికి కాశ్మీర్ సమస్యనే కాదు, కాశ్మీర్ రాజు కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేశారు. అప్పుడు పాకిస్థాన్ యుద్ధానికి సిద్ధమైంది, భారత్ పాకిస్థాన్‌ను మట్టి కరిపిస్తుందని నెహ్రూ వద్ద సమాచారం ఉన్నా, నెహ్రూ తాను గొప్పగా దౌత్యం నిర్వహిస్తానని చెప్పుకోవడానికి ఐక్యరాజసమితి వద్దకు కాశ్మీర్ సమస్యను తీసుకువెళ్ళారు. కాశ్మీర్ సమస్యను కూడా పరిష్కరిస్తానని సర్దార్ చెప్పినా, నెహ్రూకున్న వ్యక్తిగత కారణాల రీత్యా అందుకు అంగీకరించలేదు. అప్పటినుంచి కాశ్మీర్ ఇప్పటివరకు రగులుతూనే ఉన్నది.

భారతదేశ తోలి ప్రధాని కావలసిన వ్యక్తి. 1946లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి(congress presidency) ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో గెలిచిన వారు అధ్యక్ష పదవితో పాటు ప్రధాన మంత్రిగా కూడా పనిచేయాలని తీర్మానించారు. గాంధీ 16 రాష్ట్రాల ప్రతినిధులను పిలిచి సరైన వ్యక్తిని ఎన్నుకోమని చెప్పారు. 16లో 13 రాష్ట్రాల ప్రతినిధులు వల్లభాయి పటేల్ పేరును ప్రతిపాదించారు. గాంధీ నెహ్రూకు ఈ విషయం చెప్పి,సర్దార్ ను ప్రధాన మంత్రిని చేయాలన్న విషయం పై మీ అభిప్రాయం చెప్పండి అనగా,ఆయన తల దించుకోని మౌనంగా ఉన్నారు. నెహ్రూ కు ప్రధాని కావలన్న అలోచన ఉంది అని అర్దం చేసుకున్న గాంధీ సర్దార్ కు చిన్న కాగితం మీద ఏదో వ్రాసి ఇవ్వగా ఆయన ప్రధాన మంత్రి పదవికి పోటినుండి తప్పుకున్నారు. గాంధీ చెప్పిన మాటకు కట్టుబడి తన ప్రధాని పదవిని నెహ్రూకు త్యాగం చేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్. 

Tuesday 28 October 2014

శివారాధన

ఓం నమః శివాయ

కార్తీకమాసంలో శివారాధనకు చాలా ప్రత్యేకత ఉంది. శివం అంటే శుభం, శోభనం, మంగళం అనే అర్దాలున్నాయి. దేవాదిదెవుడు, మహాదేవుడు, లయకారుడైన శివుడు భోళాశంకరుడు (అంటే అడిగిన వెంటనే వరాలు కురిపిస్తాడు, కొద్దిగా పూజ చేసిన, బోలెడు ఫలితాన్ని ఇస్తాడు, చిన్న సేవకే మురుసిపోతాడు). యోగ సంప్రదాయంలో శివుడు యోగులు యోగి, సృష్టిలో ఆదియోగి. శివుడి ద్వారానే లోకానికి యోగా, ధ్యానం మొదలైన విద్యలు పరిచయమయ్యాయి. కనుక యోగ సాధన చేసేవారు, పురోగతి కోసం తప్పకుండా శివారాధన చేయాలి.

శివారాధన చాలా సులువు. పెద్దగా పూజా సంభారాలు అవసరంలేదు, ఆడంబరాలు అసలే అవసరంలేదు. కాసిన్ని నీరు అభిషేకిస్తే చాలు, పొంగిపోతాడు. మంత్రాలు రావన్న బాధ అవసరంలేదు, ఓం నమః శివాయ అన్న మంత్రం చాలు. శివుడు యోగి అయినా, ఐశ్వర్యానికి అధిపతి. పూజించినవారికి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. దక్షిణామూర్తి రూపంలో విద్యను, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. శివుడు విద్యను ప్రసాదిస్తాడు కనుకే అక్షరాభ్యాసంలో ముందుగా "ఓం నమః శివాయ సిద్ధం నమః" అని రాయిస్తారు.

అటువంటి శివుడికి కార్తీకం అత్యంత ప్రీతికరం. ఈ కార్తీకంలో ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయండి. పెద్దగా ఆర్భాటం అవసరంలేదు. చిన్న శివలింగానికి, ఒక గ్లాసుడు మంచినీరు పోస్తూ, ఓం అని కానీ, లేక ఓం నమః శివాయ అని కానీ, మనసులో స్మరించుకుంటే చాలు, పెద్ద అభిషేకం చేసినట్టు పొంగిపోతాడు. అభిషేకం చేసే అవకాశం లేకపోతే, కనీసం మానసికంగా పూజించినా చాలు. మీ మనసులోనే ఒక శివలింగాన్ని ఊహించుకుని, మీరు మీకు నచ్చిన ద్రవ్యాలతో అభిషేకం చేస్తునట్టు భావించి, మనసులో పూజించినా, ఫలితం వేసేస్తాడు పరమశివుడు.

శివపూజకు స్త్రీపురుష భేధం లేదు, వర్ణాశ్రమ బేధం అంతకంటే లేదు, ఎవరైనా, పరమశివుడిని అర్చించవచ్చు. ఉదయమే అరించాలన్న నియమం లేదు. శివుడికి ప్రదోష పూజ చాలా విశిష్టవంతమైంది. ప్రదోషం అంటే సాయంకాల సమయం. ఉదయమంతా ఆఫీసులో గడిపినా, సాయంకాలం ఇంటికి వచ్చాకా, ఆరాధన చేయవచ్చు. ఈ కార్తీకం నుండి శివారాధన ప్రారంభించండి.  

Sunday 26 October 2014

నాగుల చవితి విశేషాలు

కార్తీక శుద్ధ చవితి, నాగుల చవితి - విశేషాలు

మన దేశంలో ప్రాచీన కాలం నుండి నాగపూజ చేసే ఆచారం ఉంది. కార్తీక శుద్ధచవితిని నాగులచవితిగా జరుపుతారు. పూజించడం అంటే గౌరవించడం అని అర్ధం. వ్యవాసాయంలోనూ, జీవవైవిధ్య రక్షణలోనూ ప్రధానపాత్ర పోషిస్తూ భూమిపై సమతుల్యానికి, జీవనానికి, ప్రత్యక్షంగా, పరోక్షంగా తోడ్పడుతున్న సర్పజాతికి నీరాజనం పట్టి, గౌరవించడమే ఇక్కడ పూజించడం అని అర్ధం చేసుకోవాలి.

ఉదయమే తప్పకుండా తలంటుస్నానం చేయాలి. ఈ రోజు చేసే తలస్నానం కళ్ళు, చెవులకు సంబంధించిన సమస్త రోగాలను తొలగిస్తుంది.

నాగులచవితి రోజున ఉపవాసం ఉండి పాముపుట్టను పూజించాలి. పుట్టలో ఆవుపాలు పోయాలి. పుట్టను పూజించే అవకాశం లేనప్పుడు నాగవిగ్రహాన్ని పాలతో అభిషేకించాలి. సాధారణంగా ప్రతిచోట ఆలయాలలోనూ, రావి, వేప చెట్ల క్రిందా ఈ నాగవిగ్రహాలు / నాగబంధం ఉంటుంది.

ఒక విషయం గుర్తుంచుకోండి. పాములు సరీసృపాలు కనుక పాలు త్రాగవు. అలా అని అన్ని పాములు పాలు త్రాగవని కాదు, దేవతసర్పాలు మాత్రమే పాలు త్రాగుతాయి. మాములు పాములు పాలు త్రాగితే అరగక కక్కెస్తాయి, మరణిస్తాయి కూడా. దేవత సర్పాలు ఎక్కడపడితే అక్కడ ఉండవు. మనిషి కంటికి కనిపించవు, అంటే మానవ కదలికలను లేని మహారణ్యాలలో మాత్రమే ఉంటాయి. అందువల్ల పుట్టలో పాక్యేట్ల కొద్ది పాలు పోయకండి. నాగజాతిని తలుచుకుని నాగదేవతకు నైవేద్యంగా ఒకటి, రెండు చెంచాల పాలు మాత్రమే పుట్టలో పోసి మిగితావి ప్రసాదంగా స్వీకరించడం మంచిది. ఇక నాగదేవత పూజలో పసుపుకుంకుమలను పుట్ట దగ్గర వాడవద్దు. పసుపు అంటే పాములకు అలర్జీ. పసుపు వాటి శరీరానికి అంటుకోవడం వలన కూడా అవి మరణీంచే అవకాశం ఉంటుంది. పండుగ పూట పాపం చేయకండి. పసుపుకుంకుమలను పుట్ట దగ్గర వాడకండి. ఇటువంటి మరికొన్ని విషయాలను నాగపంచమి సంధర్భంగా ప్రచురించడం జరిగింది. లింక్‌లో http://goo.gl/B7ljRm గమనించగలరు.   

నాగులచవితికి నువ్వులపిండి, చలిమిడి, వడపప్పు, చిమ్మిలి తప్పనిసరిగా నివేదనగా సమర్పించాలి. ఇవి గర్భదోషాలను తొలగిస్తాయి, ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి.      

పుట్ట దగ్గర / నాగబంధం దగ్గర పూజించాకా, ఇంటి గడప దగ్గర కూడా పాలుపోయాలి. ప్రతి ఇంటి గుమ్మం దగ్గర నాగరాజు కొలువుండి ఇంటిని రక్షిస్తుంటాడు. కనుక ఇంటి గడప మీద పాలు పోయండి, కాసింత చిమ్మిలి, చలివిడి పెట్టండి, ఒక అరటిపండు ముక్క పెట్టండి. నాగులను పాలు పోసి పూజించాం కనుక ఈ రోజు తరిగిన కూరలు తినకూడదని పెద్దలు చెప్తారు. కనుక ఆహారం తీసుకునేవారు, కత్తితో కూరలు కోయకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోండి.

మరునాడు ఇంట్లో బంగారంతో కాని,వెండితో కాని,కొయ్యతో(చెక్క) కాని,మట్టితో కాని చేసిన నాగప్రతిమను పంచామృతాలతోనూ,జాజి,సంపెంగ లాంటి సువాసనగల పూలతోనూ పూజించాలి. ఈ నాగపూజ వలన సర్పదోషాలు నశిస్తాయి.  

Friday 24 October 2014

భగినీహస్తభోజనం

కార్తీక శుద్ధ విదియ, యమద్వితీయ, భగినీహస్తభోజనం

భగినీ అంటే తోబుట్టువైన స్త్రీ అంటే అక్క లేదా చెల్లి అని అర్ధం. సనత్కుమార సంహితలో ఈ యమ ద్వితీయ, భగినీహస్తభోజనం విశేషాలు చెప్పబడ్డాయి. సూర్యునికి ఇద్దరు భార్యలు ఛాయా, ఉష. సూర్యునకు ఛాయాదేవి వలన కలిగిన సంతానం యముడు, యమున. యముడి చెల్లెలు యమున. యమునా దేవి ప్రతిరోజు తన ఇంటికి వచ్చి విందు భోజనం చేసి వెళ్ళమని యముడిని ప్రార్ధిస్తూ ఉండేది. యముడికి తీరికలేక - ఎన్నోసార్లు వస్తానని చెప్పినా వెళ్ళలేదు. ఒకనాడు చెప్పకుండానే తన కుటుంబంతో కలిసి యమున ఇంటికి వెళ్తాడు. ఆ రోజే కార్తీక శుద్ధ ద్వితీయ.

చెల్లులు మహానందంతో అన్నకు, ఆయన కుటుంబానికి రుచికరమైన విందుభోజనం పెట్టింది. సంతోషించిన యముడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. యమున "అన్నా!  ప్రతిసంవత్సరం ఇదే విదియ నాడు నా ఇంటికి వచ్చి, నా చేతి వంటలు స్వీకరించి, నన్ను దీవించాలి. అంతేకాదు, ఈ కార్తీకశుద్ధవిదియ నాడు ఎవరు సోదరిహస్త భోజనం చేస్తారో వారు నరకాన్ని పొండకూడదు" అని అర్ధించింది. యముడు "తధాస్తు!శుభమస్తు! " అని అనుగ్రహిస్తూ "అమ్మా!ఈ దినం ఎవరు యమునా నదిలో స్నానం చేసి, పితృదేవతలకు తర్పణం చేసి, తన సోదరిని గౌరవించి, ఆమె చేతి భోజనం చేస్తారో వాళ్లు ఎన్నటికి నరకద్వారాన్ని చూడరు" అని అంటాడు.

కనుక కార్తీకశుద్ధవిదియ రోజున సోదరి ఇంట భోజనం చేసినవారు పరలోకంలో సుఖిస్తారని, ఏ సోదరి తన సోదరునికి ఈ రోజున భోజనం పెడుతుందో, అన్నను గౌరవిస్తుందో, ఆమె దీర్ఘసుమంగళిగా ఉంటుంది. ఇదే రోజున 'భ్రాతృ ద్వితీయను కూడా చేస్తారు. పేరు తేడా తప్ప మిగితాది అంతా అదే పద్ధతి. భ్రాతృ ద్వితీయలో సొదరి తన సోదరులకు నూతనవస్త్రాలిచ్చి గౌరవిస్తుంది. యమద్వితీయలో సోదరుడు సోదరికి వస్త్రాభరణాలు ఇచ్చి దీవిస్తాడు.
             
సోదరీసోదర ప్రేమలను కలకాలం నిలిపేందుకు,బంధాలను మెరుగుపరిచేందుకు ఇది ప్రతీక. అన్న చెల్లెలి అభుదయాన్ని, సౌమాంగల్యాన్ని, చెల్లులు అన్న శ్రేయస్సును, దీర్ఘాయువును ఆకాంక్షించే పవిత్ర పర్వదినం - ఈ పండుగ.

హరిః ఓం

సేకరణ: సప్తగిరి, నవంబరు 2012  

Thursday 23 October 2014

కార్తీక మాసం

కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి వస్తుంది కనుక ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు. కార్తీకమాసానికి కౌముది మాసం అని పేరు కూడా ఉంది. కౌముది అంటే వెన్నెల. ఈ మాసంలో చంద్రుడి నుంచి వచ్చే వెన్నల అమృత బిందువులను వర్షిద్తుంది. సంవత్సరంలో 12 నెలల్లో దేవతలను ఎక్కువగా పూజించడానికి కార్తీకమాసం శేయస్కరం. ఈ మాసంలో శివకేశవులిద్దరిని కలిపి ఆరాధించాలి. కార్తీకపురాణంలో రోజుకో అధ్యాయం చదవడం మంచిది.

ఆచరించవలసినవి - ఈ నెలలో కార్తీకస్నానం, కార్తీకదీపం, ఉపవాసం చాలా ముఖ్యమైనవి. రోజూ తెల్లవారు జామునే దగ్గరలో ఉన్న నది, చెరువు, తటాకం లోనో లేదా బావి దగ్గరో తలస్నానం చేయాలి. ఈ స్నానం సూర్యోదయానికి కంటె ముందే మిగియాలి. ఇంకా చెప్పాలంటే నక్షత్రాలు వెళ్ళకముందే స్నానం చేయాలి. ఇలా చేసే స్నానం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

కార్తీకేహం కరిష్యామి ప్రాతః స్నానం జనార్దన|
ప్రీత్యర్ధం తన దేవేశ దామోదర మయా సహ||

అనే మంత్రం చెప్పి తలస్నానం చేయాలి. ఈ కార్తీకస్నానం కాయిక, వాచిక, శారీరిక దోషాలను తొలగిస్తుంది.

స్నానం తరువాత శివుడిని బిల్వదళాల (మారేడు ఆకులు) తోనూ, విష్ణువును తులసిదళాలతోనూ పూజించాలి. అలాగే ఈ నెలలో తుమ్మి పూలతో శివుణ్ని, అవిసె పూలతో విష్ణువును పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది.

ప్రతి రోజూ ఉదయం (సూర్యోదయానికి ముందు), సాయంకాలం ఇంటి గడపల దగ్గర, తులసి చెట్టు దగ్గర "ఆవునెయ్యితో" దీపారాధన తప్పనిసరిగా చేయాలి. ఈ మాసంలో చేసే దీపారాధనకు చాలా ప్రాముఖ్యం ఉంది. కార్తీకమాసం మొత్తం ఏకభుక్తం (ఒక పూట మాత్రమే భోజనం చేయడం) ఉండడం, పగలు ఉపవాసం చేసి రాత్రి భోజనం చేయడం చేత పుణ్యం సిద్ధిస్తుంది, ఆరోగ్యం రక్షింపబడుతుంది. పగలంతా ఉపవాసం చేయలేనివారు అల్పాహారం తీసుకోవచ్చు (బ్రహ్మచారులు (పెళ్ళి కానివారు), 80 సంవత్సరములు పైబడినవారు, ఆనారోగ్యంతో బాధపడేవారు, కాయకష్టం చేసేవారు (శారీరకశ్రమతో పని చేసేవారు, బలహీనులు) ఈ ఉపవాసం చేయనవసరంలేదు). ఈ నెలంతా ఉపవాసం చేయలేనివారు కనీసం సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి, మాసశివరాత్రి లాంటి పర్వదినాలలో అయినా ఆచరించడం ఉత్తమం.

ఈ మాసం మొత్తం బ్రహ్మచర్యాన్ని పాటించాలి, కార్తీకం లో ఉల్లి, ఇంగువ, పుట్టగొడుగులు, గంజాయి, ముల్లంగి, ఆనపకాయ, మునగకాడలు, వంకాయ, గుమ్మడికాయ, వాకుడు, పుచ్చకాయ, వెలగపండు, నూనె, చద్ది మొదలైనవీ, రెండుమార్లు వండిన అన్నం, మాడిన అన్నం, మినుములు, పెసలు, సెనగలు, ఉలవలు, కందులు మొదలైన ధాన్యాలు (ద్విదళాలు) వాడరాదు. మాంసాహారాలు, బిర్యానీలు, బయట అమ్మె వంటకాలు, చిరుతిళ్ళు, మసాలాపదార్ధాలు తినడం నిషిద్ధం. ఉపవాసం పక్కన పెట్టేసినా, అందరూ ఆచరించదగ్గవి ఆహారనియమాలు పాటించడం, ఉదయమే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానం ముగించడం, రోజు దీపం వెలిగించడం. ఈ రెండు చేసినా, అతిత్వరలో జీవితంలో పెనుమార్పు కనిపిస్తుంది.

ఓం నమో శివనారాయణాయ 

బలి పాడ్యమి

కార్తీకశుద్ధ పాడ్యమి, బలిపాడ్యమి

కార్తీక శుద్ధ పాడ్యమికే బలి పాడ్యమి అని పేరు. ఈ పాడ్యమి బలిచక్రవర్తికి ప్రీతికరమైన రోజు. ఈ రోజు తెల్లవారుజామునే లేచి బలిచక్రవర్తిని పూజించాలి. బియ్యపు పిండితో బలిచక్రవర్తి బొమ్మను గీచి పూజ చేయవచ్చు. పూజ సమయంలో

బలిరాజ నమస్తుభ్యం
విరోచనసుత ప్రభో,
భవిష్యేంద్ర సురారాతే
పూజేయం ప్రతిగృహ్యతాం

అని ప్రార్ధించాలని, గోవర్ధనపూజ చేయాలని, ఆవులను అలంకరించి స్వేచ్చగా తిరగనివ్వాలని, శక్తి కొలది దానం చేయాలని చెప్తారు.

ఇది బలచక్రవర్తికి సంబంధించిన కధ. వామనుడైన విష్ణువుకు 'మాట తిరుగని మానధనుడైన బలిచక్రవర్తి తన సర్వస్వాన్ని దానం చేశాడు. అందుకు సంతోషించిన విష్ణువు వరం కోరుకోమన్నాడు.

అప్పుడు బలిచక్రవర్తి "దేవా! నా సర్వస్వాన్ని నీకు సమర్పించాను. నాకోసం కోరడానికి ఏమి లేదు. లోకం కోసం ఒక వరం అర్ధిస్తున్నాను. ఇష్టమైతే అనుగ్రహించు. నేను దానమిచ్చిన భూమిని వామనుడివై అంతటా ఆక్రమించావు. కనుక నీ మూడు అడుగులకు సంకేతంగా - ఆశ్వయుజ బహుళ చతుర్దశి, అమావాస్య, కార్తీక శుద్ద పాడ్యమి (3 రోజులు) - భూలోకంలో బలిచక్రవర్తి రాజ్యంగా ఉండాలి. నా రాజ్యంలో దీపదానం, దీప పూజ చేసే ఇంట్లో నీ భార్య లక్ష్మీ దేవి శాశ్వతంగా ఉండాలి. నా రాజ్యంలో ఎవరి ఇంట అంధకారం ఉంటుందో వాళ్ళ ఇంట ఎప్పటికి చీకటే ఉండాలి" అన్నాడు. విష్ణువు తధాస్తు అన్నాడు.

బలిచక్రావర్తి కార్తీకశుద్ధపాడ్యమి - తాను పాలించిన భూలోకాన్ని చూడడానికి సాయంకాలం వస్తాడు. అతనివెంట గదాధరుడైన భగవంతుడు మహావిష్ణువు వస్తాడు. ఇలా భక్తుడూ, భక్తరక్షకుడైన భవంతుడు - ఇద్దరు వస్తారు కనుక వీధులు శుభ్రంగా ఉండి, ప్రతి ఇంటి ముంగిట దీపాలూ, మామిడితోరణాలు, రంగురంగుల ముగ్గులూ ఉండటం చూసి, తన రాజ్యంలో ప్రజలందరూ ఆనందం, ఉత్సాహం, భోగభాగ్యాలతో హాయిగా ఉన్నరాని బలి సంతోషపడతాడు. భగవంతుడు ఆనందిస్తాడు. అందువల్ల దీపావళి మరుసటి రోజు 'బలి పాడ్యమి 'అయ్యింది. అంతేకాని జంతుబలులతో విందుచేసుకోవడం బలి పాడ్యమి కాదు.
         
సేకరణ: శ్రీ శైలప్రభ, అక్టోబరు 2012, సప్తగిరి, అక్టోబరు 2011

Wednesday 22 October 2014

దీపావళి విశేషాలు

దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. దీపమాలికలతో లక్ష్మీదేవికి నీరాజనమిచ్చే రోజు కావడం చేత దీనికి దీపావళి అని పేరొచ్చింది. ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకుంటాం.


పురాణప్రాశస్త్యం - త్రేతాయుగంలో రావణాసురిడిని చంపిన శ్రీ రామచంద్రుడు ఆశ్వీయుజ అమావాస్య రోజునే అయోధ్యకు చేరుకున్నాడు. తమకు ప్రియాతిప్రియమైన రాముడు 14 ఏళ్ళ తర్వాత తిరిగి తమ వద్దకు వస్తున్నాడనే సంతోషంతో అయోధ్యలో పండుగ వాతావరణం ఏర్పడింది. ప్రజలు శ్రీ రాముడిని దీపాలు వెలిగించి ఆహ్వానించారట. అయోధ్య మొత్తం దీపకాంతులతో అలంకరించారని, చరిత్రలో జరిగిన ఈ సంఘటనకు గుర్తుగా దీపావళీ జరుపుకుంటారని ఒక కధనం.

ద్వాపరయుగంలో శ్రీ కృష్ణుడు నరకాసుర వధ చేసిన తర్వాత అనేకమందికి విముక్తి లభించింది, అనేకమంది స్త్రీల జీవితాల్లో వెలుగు వచ్చింది. నరకాసురవధకు సంతొషించిన ప్రజలు అమావాస్య రోజున దీపాలు వెలిగించి బాణాసంచా కాల్చి, ఆనందాన్ని వ్యక్తం చేసారు. అది కూడా ఈ రోజునే. నరకుడంటే అహకారం. అహకారం నశించినవారికి జీవితంలో చీకటి అనేదే ఉండదు. అహం నశించడం, జ్ఞానం కలగడం ఒకేసారి జరుగుతాయి. జ్ఞానం వ్యక్తిలో ఉన్న సంచితకర్మ ఫలాలను, పూర్వజన్మ వాసనలను నశింపజేస్తుంది. దానికి ప్రతీకగా అమావాస్య రాత్రి దీపాలు వెలిగిస్తారు.

ఆచరించవలసినవి -  ఈ రోజున తెల్లవారు జామున్నే(వెకువ జామున/సూర్యోదయానికి గంటన్నర ముందు)తలకి నువ్వుల నూనె పెట్టించుకొని, తలంటు స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు చెట్ల కొమ్మలను వేసి, ఆ నీటితో స్నానం చేయడం ఆరోగ్యకరం, మంగళప్రదం. ఈరోజు చేసే అభ్యంగనస్నానం సర్వ పాపాలను హరింపజేయడమే గాక గంగా స్నానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది.

దీపావళి నాడు విధివిధానంగా లక్ష్మీ పూజ చేయాలి. కాగా కొన్ని ప్రాంతాల్లో పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం లక్ష్మీ దేవిని పూజించే సంప్రదాయం ఉంది. దీపావళి రోజున లక్ష్మీ దేవి భూలోకానికి దిగివచ్చి, ప్రతి ఇల్లు తిరుగుతూ శుభ్రంగా,మంగళకరంగా వున్న ఇళ్లలో తన కళ వుంచిపోతుందని చెప్పబడింది. అందుకే దీపావళి నాటికి ఇంటిలోని పనికిరాని వస్తువులను బయట పారవేసి ఇంటిని శుభ్రంగా చేసి, లక్ష్మీదేవి రావాలని కోరుతూ ఇంటిని అలంకరించాలి.

ఇక సాయంకాలం ఇంటి ముంగిట, ఆలయాలు, మఠాల ముంగిట, గో శాలల్లోనూ దీపాలను వెలిగించాలి. చీకటిపడే సమయాంలో దీపదానం చేసి, మండుతున్న కట్టేల్ని త్రిప్పాలి. ఇలా త్రిప్పడం చేత పీడ పొతుందని చెప్తారు. నిజానికి దీపావళి కొంతవరకు పితృదేవతలకు సంబంధిచిన పండుగ.  దీపావళీ సాయంత్రం గొంగూర కాడల మీద దీవిటీలు వెలిగించి తిప్పుతారు. ఇవి పితృదేవతలకు దారిని చూపిస్తాయి. తద్వారా పితృదేవతలు సంతసిస్తారు, వారి దీవెనలు ఉంటే వంశం నిలబడుతుంది.  తరువాత అలక్ష్మి (దరిద్రం) తొలగడానికి లక్ష్మీ పూజ చేయాలి. ఆకులతో దొన్నెలు కుట్టి, దీపాలు వెలిగించి, నదుల్లోనూ, చెరువుల్లోనూ, సరోవరాల్లోనూ, బావుల్లోనూ వదలాలి. దీపావళీ అర్దరాత్రి 12 గంటలకు చీపురుతో ఇల్లు చిమ్మి, అలక్ష్మీని బయటకు పంపాలి.

నూతన వస్త్రాలు ధరించాలి. అన్నదానం చేయాలి. అర్ధరాత్రివేళ చేటలపై కర్రలతో కొడుతూ, తప్పెట్ల చప్పుళతోనూ, డిండిమం అనే వాయిద్యాన్ని వాయిస్తూ జ్యేష్ఠాలక్ష్మిని (దరిద్ర దేవతను) సాగనంపాలని శాస్త్రవచనం.
(ఇందులో కొంత భాగం  సేకరణ: శ్రీ శైలప్రభ,అక్టోబరు 2012,సప్తగిరి,అక్టోబరు 2011  )

దీపావళి నాడు 5 ప్రదేశాల్లో దీపాలు తప్పక వెలిగించాలని శాస్త్రం చెప్పింది. వంట గదిలో, ఇంటి గడపకు ఇరువైపులా, ధాన్యాగారంలో (బియ్యం, పప్పులు మొదలైనవి నిలువ ఉంచే ప్రదేశంలో), తులసి కోటలో లేదా తులసిమొక్క దగ్గర, రావి చెట్టు కిందా దీపారాధన చేయాలి.

అంతేకాదు, పెద్ద వయసు వారు నివసిస్తున్న ఇళ్ళ దగ్గర, దేవాలయాలు, మఠాలు, గోశాలల్లో, పెద్ద వయసున్న చెట్ల వద్ద, ఆకాశదీపం (దేవాలయాల్లో అయితే ధ్వజస్థంభానికి వెలిగిస్తారు, మనం ఇళ్ళ పైకప్పు మీద పెట్టాలి), నదుల్లోనూ, చెరువుల్లోనూ దీపాలను వదలాలి. ప్రతి గదిలోనూ, ప్రతి మూలలోనూ దీపం వెలిగించాలి. అలాగే నాలుగు వీధుల కూడలిలో (నాలుగు రోడ్లు కలిసే ప్రదేశంలో) దీపం వెలిగించాలి. నువ్వుల నూనె దీపాలనే వెలిగించండి. మట్టి ప్రమిదలనే వాడండి. 

శాస్త్రీయ కారణం -  కొద్దిపాటి టపాసులు పేల్చడం వెనుక కూడా ఒక కారణం ఉంది. ఇప్పుడు భూమి నుంచి పుట్టే వివిధ రకములైన క్రిమికీటకాలు రోగాలను కలిస్తాయి. దీపావాళి నాటి రాత్రి కాల్చే మందుగుండు సామగ్రి నుంచి వెలువడే పొగ, వాసన ఈ కాలంలో వ్యాపించే దోమలను, క్రిములను హరింపజేస్తుంది. కానీ మరీ ఎక్కువగా కాలిస్తే, ఆ పొగ మనకూ హాని చేస్తుంది, శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుంది. 

అందరికి దీపావాళి శుభాకాంక్షలు.

నరకచతుర్దశికి, దీపావళికి నువ్వుల నూనె దీపాలనే వెలిగించాలంటొంది శాస్త్రం.


నరకచతుర్దశికి,దీపావళికి నువ్వుల నూనె దీపాలనే వెలిగించాలంటొంది శాస్త్రం. ప్రతి సంవత్సరం క్రొత్త మట్టి ప్రమిదలు కొని వాటిని వాడాలి.

మట్టి ప్రమిద మన శరీరానికి సంకేతం. అందులో నువ్వులనూనె మన పూర్వజన్మ వాసనలకు (గత జన్మ నుండి మనకు ప్రాప్తించిన పాపపుణ్యాలు, అలవాట్లు, సంస్కారాలు) ప్రతీక. అందులో వేసే వత్తి అహంకారానికి గుర్తు.  దీపం జ్ఞానానికి సంకేతం. జ్ఞానమనే దీపం మన పూర్వజన్మవాసనలను, అహంకారాన్ని, చెడు అలవాట్లను కాల్చేసి, పరమాత్ముడిని చేరుస్తుంది అన్నది దీపం వెలిగించడం వెనుక ఉన్న అర్ధం. అందువల్ల దీపావళికి మట్టి ప్రమిదలనే కొనండి.

ఈ ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి పండుగ రోజుల్లో నువ్వుల నూనె దీపాన్నే వెలించాలి. నువ్వుల నూనె క్రిమిసంహారిణి. యాంటి-బ్యాక్టీరియల్ (anti-bacterial) లక్షణాలు కలిగి ఉంటుంది. అందువల్ల నువ్వుల నూనె దీపం వాతావరణంలో ఉన్న క్రిములను నాశనం చేస్తుంది. ఈ దీపపు కాంతి కళ్ళకు మంచిది. దృష్టిని (eye-sight) మెరుగుపరుస్తుంది. ఇక దీపావళి నాడే ఎందుకు నువ్వుల నూనె దీపం పెట్టాలి అంటే దీపవళి చలికాలంలో వస్తుంది. సూర్యుడు భూమికి దూరంగా జరుగుతాడు. చల్లటి వాతావరణంలో అనేక క్రిములు వ్యాపిస్తాయి. అలాగే శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు వస్తాయి. ప్రమిదలో నూనె అయిపోయాక వత్తి కూడా కాలిపోతుంది. ఆ వత్తి కాలడం వల్ల వచ్చిన వాసన పీల్చడం ద్వారా ఊపిరితిత్తులు (lungs), గుండెకు(heart) సంబంధించిన రోగాలు రాకుండా నిరోధింపబడతాయి. అలాగే ఈ దీపం కొంత వేడిని కూడా పుట్టిస్తుంది. ఏదైన ఒక వస్తువు కాలినప్పుడు carbon విడుదలవుతుంది. అది గాలిలో ఉన్న తేమను పీల్చేస్తుంది.

మార్కెట్లో దీపావళి కి ప్రత్యేకమైన క్యాండిల్ దీపాలు అమ్ముతున్నారు. అవి వెలిగించకూడదు. సంప్రదాయ దీపం ప్రకృతిలో ఉన్న positive energy ని, దైవి శక్తులను ఆకర్షిస్తే, క్యాండిల్ negative energies ని, దుష్టశక్తులను ఆకర్షిస్తుంది. కావాలంటే మీరు ఒక చీకటి గదిలో క్యాండిల్ వెలిగించి కాసేపు కూర్చొండి. మరొకసారి అదే గదిలో దీపారాధన చేసి కూర్చోండి. మీరే గమనిస్తారు తేడా. క్యాండిల్ శోకానికి కారణమవుతుంది. దీపం శుభాలను తీసుకువస్తుంది.

ఎక్కడ దీపం పేడితే అక్కడ దేవతలు వస్తారు. అందువల్ల దీపకాంతులలో శ్రీ మహా లక్ష్మీని మీ ఇంట్లొకి ఆహ్వానించండి.

అందరికి నరకచతుర్దశి,దీపావళి శుభాకంక్షలు.

Tuesday 21 October 2014

నరక చతుర్దశి విశేషాలు

ఆశ్వీయుజ బహుళ చతుర్దశి - నరక చతుర్దశి

పురాణ ప్రాశస్త్యం: పూర్వం నరకాసురుడనే రాక్షసుడు ప్రాక్ జ్యోతిష్యపురాన్ని పరిపాలించేవాడు. ఆ ప్రాక్ జ్యోత్సిహ్యపురం అనే ప్రాంతం ఈ రోజు ఈశాన్య భారతంలో అస్సాంలోని గౌహతి ప్రాంతం. వాడు 16,000 మంది కన్యలను తన కారాగారంలో బంధించగా, శ్రీ కృష్ణుడు సత్యంభామ సమేతంగా వెళ్ళి, వాడితో యుద్ధం చేసి, వాడిని చంపి, ఆ కన్యలను విడిపిస్తాడు. నరకాసుర వధ జరిగి, స్త్రీలకు దుష్టుడైన నరకుడిని నుంచి విముక్తి లభించినందుకు ప్రతీకగా ఈ రోజు నరక చతుర్దశి జరుపుకుంటారు.  నరకుడి వధతో వాడు చేత హింసించబడి అంధకారంలో మగ్గుతున్న అనేకమంది బయటకు వచ్చారు, విముక్తి పొందారు, అందుకు ప్రతీకగా దీపాలు వెలిగిస్తారు. ఈ నరక చతుర్దశికి అంతరిక్షంలో జరిగే కొన్ని వింతల కారణంగా కూడా దీనికి ఈ ప్రత్యేకత వచ్చింది.   

నరక చతుర్దశి సంధర్భంగా అందరూ ఆచరించవలసిన విషయాలు తెలుసుకుందాం.
నరక చతుర్ద రోజు తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి గంటన్నర ముందే నువ్వుల నూనెతో తల అంటుకొని స్నానం చేయాలి. దీనినే తైలాభ్యంగనస్నానం అంటారు. ఇది నరక చతుర్దశి రోజు తప్పక చేయవలసిన విధి. స్నానానికి ఉపయోగించే నీటిలో ఉత్తరేణి, తగిరస, తుమ్మి చెట్లకొమ్మలను కలియబెట్టాలి. స్నానం మధ్యలో ఉత్తరేణి ఆకులను తలపై త్రిప్పుకొని పారేయాలి. ఈరోజు చేసే స్నానం నరక భయాన్ని పొగొడుతుందని, మంగళకరమని చెప్పబడింది. ఆ సమయంలో స్నానం చేయకపోతే దరిద్రం పట్టుకుంటుందని శాస్త్రం చెప్తోంది.

నరకుడనే అహకారాన్ని వెతికి చంపినందుకు గుర్తుగా చేసే స్నానం ఇది. నరకాసురుడంటే అహకారం. జ్ఞానం మాత్రమే అహాన్ని నశింపజేస్తుంది. కనుక చతుర్దశి రోజు చేస్తున్న ఈ స్నానం జ్ఞానానికి సంకేతం అన్నారు భగవాన్ రమణ మహర్షి.

ఈ రోజున సూర్యోదయానికి ముందు నువ్వులనూనెలో లక్ష్మి దేవి, నీటిలో గంగా దేవి ఉంటారని, అందువల్ల ఆ సమయంలో చేసే పైన చెప్పిన విధంగా చేసే స్నానం వల్ల లక్ష్మీదేవి, గంగాదేవిల అనుగ్రహం కలుగుతుందని శాస్త్రం చెప్తోంది. స్నానాంతరం దక్షిణదిశగా తిరిగి యమనామాలు స్మరిస్తూ మూడుసార్లు యమునికి తర్పణం విడువాలి. తల్లిదండ్రులు లేనివారు మాత్రమే ఈ తర్పణాలు వదలాలి.

ఈరోజు ప్రదోషంలో అంటే సాయంకాలం ఇంటిముందు, ఆలయాల్లోనూ దీపాలను వెలిగించాలి. నాలుగు వత్తులతో దీపాన్ని వెలిగించి దీపదానం చేయాలి. 

Monday 20 October 2014

ధనత్రయోదశి విశేషాలు

ఆశ్వీయుజ బహుళ త్రయోదశి - దీనికే ధనత్రయోదశి, ధన్వంతరి జయంతి అని పేరు.

ధనత్రయోదశి విశేషాలు:

పురాణప్రాశస్త్యం : పాలసముద్రంలో మందరపర్వతాన్ని అమృతం కోసం దేవతలు, రాక్షసులు చిలికినప్పుడు అమృతభాండాన్ని ఒక చేతితోనూ, శంఖువును మరొకచేతితోనూ, మూలికలు, చక్రం మిగితా చేతితులలో ధరించి ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు ఉధ్బవించాడు #ధన్వంతరి అంటూ పురాణ కధనం. ఈయన్ను పూజించడం వలన ఆరోగ్యం సిద్ధిస్తుంది.

ధనత్రయోదశి కధ:

పూర్వం హిమ అనే పేరుగల రాజు ఉండేవాడు. అతనికి ఒకడే కుమారుడు. ఆ కొడుకుని చిన్నప్పటి నుంచి అలారుముద్దుగా పెంచారు. క్షత్రియుడు కనుక కత్తిసాము మొదలైన క్షత్రియ విద్యలన్నీ నేర్పించారు. కానీ ఈ రాకుమారుడు జాతకరీత్యా అతనకి వివాహం జరిగిన నాలుగో రొజుకు మరణిస్తాడని పురోహితులు చెప్తారు. అయినా, ఓ రాకుమారి అతడిని ఇష్టపడి పెళ్ళి చేసుకుంటుంది. తన పసుపు కుంకాలను తానే కాపాడుకుంటానని శపధం చేస్తుంది. నాలుగవ రోజు...... రాకుమారుడి గది ముందు ఆభరణాలు రాసులుగా పోస్తుంది. దేదీప్యమానంగా దీపాలను వెలిగిస్తుంది. రంగురంగుల రంగవల్లులు దిద్దుతుంది. తన ఆరాధ్య దేవతయైన లక్ష్మీదేవిని కీర్తిస్తూ శ్రావ్యంగా పాటలు పాడుతుంది. రాకుమారుడుఇ ప్రాణాలు తీసుకువెళ్ళడానికి యమధర్మ రాజు పాము రూపం ధరించి వస్తాడు. బంగారు ఆభరణాల మీద దీపపు కాంతి పడి, ఆ గదంతా వెలుగు విరజిమ్ముతున్నాయి. ఆ నెరుపు తళుకులకు ఈ పాము చూపు మందగిస్తుంది. ఆదుగు ముందుకు వేయలేకపోతాడు. ఈ యువరాణి సంగీతానికి పరవశించి వచ్చిన పని మర్చిపోయి, ఆమె సంగీతం వింటూ ఉంటాడు.  ఇంతలోనే తెల్లారిపోతుంది. యమ ఘడియలు దాటిపోవడంతో, ఖాళీ చేతులతో వెళ్ళిపోతాడు.

అందువల్ల ఈ రోజు యముడికి ప్రీతికరంగా యమదీపం వెలిగిస్తారు. ఉత్తరాదిలో ఈ రోజు సాయంత్రం ఆరుబయట, అన్నాన్ని రాశిగా పోసి యమదీపం వెలిగిస్తారు.

ఆశ్వయుజ బహుళ త్రయోదశి (అంటే నరక చతుర్దశికి ముందు వచ్చే తిధి).దీన్నే "ధన త్రయోదశి" అంటారు.ఈనాటి రాత్రి అపమృత్యువు (unnatural death) నివారణకై నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి, పూజించి, ఇంటి ముందు ఉంచాలి. దీనికి "యమ దీపం" అని పేరు. యముని అనుగ్రహం పొందడం కోసం ఈ దీపాన్ని వెలిగించాలి.

కాగా ఈ మధ్యకాలంలో ధనత్రయోదశి రోజున బంగారం కొనాలనే ప్రచారం మొదలైంది. కానీ అటువంటి నియమం ఏమీ లేదు. ప్రపంచీకరణ నేపధ్యంలో దేశంలోకి బహుళజాతి సంస్థలు వ్యాపారం కోసం వచ్చాయి, లాభలు ఆర్జించడమే ధ్యేయంగా ఉన్న సంస్థలు మార్కెట్ చేసుకోవడం కోసం అక్షయతృతీయ, ధనత్రయోదశి రోజున బంగారం కొనాలనే ప్రచారాన్ని మొదలుపెట్టాయి. అసలు ఇటువంటి ఆచారం మన బామ్మలకు, అమ్మమ్మలకే తెలియదట. వాళ్ళకే ఇది వింతగా ఉందంటే అసలు విషయం ఏంటో అర్దం చేసుకోవచ్చు. పురాతనకాలంలో భారతదేశంలో పండుగ రోజంటూ ఏదైనా ఉందంటే అది దానం చేసిన రోజే. సంపదలు దాచుకోవడం కాకుండా, ఉన్న సంపదను పుణ్యంగా మార్చుకుని, వచ్చే జన్మలకు ఉపయోగించుకోవడం భారతీయుల విధానం. ధనత్రయోదశి రోజున చేసే దానం, పూజ, జపం అధికఫలాన్ని ఇస్తాయి. 17 వ శతాబ్దం వరకు భారత్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశమనీ, భారత్‌లో బంగారం పొంగిప్రవహించేదనీ ఆంగ్లేయుల రికార్డులే చెప్తున్నాయి. అటువంటి బంగారాన్ని భారతీయులు ఎప్పుడు కొనగోలు చేయలేదు, ఆ అవసరం కూడా రాలేదు. వచ్చిన అతిధులకు బంగారం దానం చేసిన సంస్కృతి మనది.

ధనత్రయోదశి శుభాకాంక్షలు 

Sunday 19 October 2014

అష్టసిద్ధులు

సందేహం - అష్టసిద్ధులు అని అంటారు కదా, వాటి గురించి వివరించండి ?

సమాధానం - సనాతనధర్మం ప్రకారం మానవజన్మ యొక్క ముఖ్య ఉద్ద్యేశం ఆత్మవిచారణ చేసి, ఆత్మానుభూతిని పొందిముక్తి పొందడం. ముక్తి పొందిన ఆత్మకు చావుపుట్టుకలు ఉండవు. ఆత్మ అనగానే అది ఏదో ఒక కొత్త శక్తి అని భావించకూడదు. నా శరీరంలో ఉండే నేను ఆత్మ. నేను ఈ శరీరాన్ని ధరించాను. శరీరం వస్త్రాన్ని ధరించినట్టుగానే, ఆత్మ శరీరాన్ని ధరించింది. వస్త్రం చినిగోతే ఎలా పడేస్తామో, అలాగే ప్రారబ్దం తిరిపోగానే ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది. తిరిగి వేరే దేహాన్ని కర్మాణుసారంగా వెతుక్కుంటుంది. ఇంత చేస్తున్న ఆత్మ ఎవరో కాదు మీరే. మనల్ని మనం శరీరంతో గుర్తించుకుంటున్నాం, కానీ మనం శరీరం కాదు. మనల్ని మనం తెలుసుకోవడమే, అన్నిటికి అతీతమైన ఆత్మ స్థితిని పొందే ప్రయత్నమే ఆత్మవిచారణ. అటువంటి ఆత్మానుభూతిని పొందే సులువైన పద్దతిని పరమశివుడు యోగం (యోగా) ద్వారా అందించారు. దాన్ని పతంజలి మహర్షి తిరిగి మానవాళికి అందించారు. ఆత్మ విచారణ చేసే క్రమంలో, సాధకునికి కొన్ని శక్తులు లభిస్తాయి. వాటితో ఆత్మవిచారణకు సంబంధం లేకపోయినా, వాటి మీద అధికమోహం అసలు గమ్యాన్ని మర్చిపోయేలా చేస్తుంది. సిద్ధులు 8 కనుక వాటిని అష్టసిద్ధులు అన్నారు. అవి

1. అణిమా - ఈ సిద్ధితో యోగి తన శరీరాన్ని చీమ కంటే, అణువుకంటే చిన్నగా మార్చుకోగలడు, పూర్తిగా అదృశ్యమవగలడు.

2. మహిమా - దీన్ని పొందడం ద్వారా యోగి తన రూపాన్ని చాలా పెద్దదిగా చేయగలడు, మేఘాలను చీల్చ్కుని, సూర్యుని తాకుతున్నాడా అన్నట్టుగా కనిపిస్తాడు.

3. లఘిమా - దీని ద్వారా దేహాన్ని చాలా తేలికాగా చేస్తారు, ఎండిన ఆకు, పక్షి ఈక కంటే తేలికగా యోగి దేహం మారిపోయే శక్తిని పొందుతుంది, ఈ సిద్ధితో గాలిలో తేలగలడు, నీటిపై నడువుగలడు.

4. గరిమా - భారీకాయంతో పర్వతాన్ని తపలిస్తూ యోగి మొత్తం గాలిని పీల్చేయగలడు.

5. ప్రాప్తి - ఈ సిద్ధితో యోగి, ఏ వస్తువునైనా తనకు నచ్చిన విధంగా రూపం మార్చగలడు, దాని స్థితిని మార్చగలడు. భవిష్యత్తును దర్శించగలడు, ఫోనులు మొదలైనవి అవసరం లేకుండా ప్రపంచంలో ఏ మూలన ఉన్నవారితోనైనా సంభాషిచగలడు, వ్యక్తిని చూసి మనసులో ఏముందో చెప్పగలడు, ఎవడు ఎలాంటివాడో, పుట్టుపూర్వోత్తరాలన్నీ చెప్పగలడు, ప్రపంచంలోని అన్ని బాషలను అర్దం చేసుకుంటాడు, ఏ భాషలోనైనా మాట్లాడుతారు, జంతువులు, మృగాలు, పక్షులు, చెట్లతో కూడా మాట్లాడగలడు, వాటి భాషను అర్దం చేసుకోగలరు.

6. ప్రాకామ్య - ఏ ఇతర శరీరాల్లోకైనా ప్రవేశించగలరు, ఇదే పరకాయప్రవేశ విద్య.

7. వశిత్వం - అందరిని వశం చేసుకుంటారు. కౄర మృగాలను సైతం తన దగ్గర పెంపుడు జంతువులను చేసుకోగలరు, తన సంకల్పబలం చేత దుష్టులను కూడా అదుపు చేయగలరు, పంచభూతాలను సైతం తన అదుపులో ఉంచుకుంటారు.

8. ఈశిత్వం - యోగి దైవశక్తిని పొందుతారు, ఈశ్వరతత్వాన్ని పొందుతారు, ఈ ప్రపంచానికి అధిపతి అవుతాడు, మరణించిన వారిని కూడా బ్రతించగలరు.

ఇవి అష్టసిద్ధులు.

ఇవి పతంజలి మహర్షి తన యోగశాస్త్రంలో వివరించిన అష్టసిద్ధులు. మంత్రజపం చేత కూడా కలుగుతాయని గురువుల వచనం. కానీ ఇతరులకు అపకారం చేయడానికి వాడుకుంటే మాత్రం సిద్ధులు నశిస్తాయి.

Thursday 2 October 2014

బతుకమ్మ పండుగ

తెలంగాణ సంస్కృతికి చిహ్నం బతుకమ్మ. బతుకమ్మ గౌరీదేవి స్వరూపం. ఆశ్వీయుజమాసంలో పెత్రమాస(మహాలయ అమావాస్య,పితృ అమావాస్య)తో మొదలవుతుంది బతుకమ్మ వేడుక. అష్టమి వరకు కొనసాగే పండుగ ఇది. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు,ఇందులో శాస్త్రీయత కూడా ఉంది.

కొత్తబట్టలు ధరించి,ఇత్తడి తాంబులంలో గుమ్మడి ఆకులు పరిచి వాటి మీద తంగేడు పూలు పేరుస్తారు. కాస్త ఏత్తులో పూల పేర్పు అయ్యాక గునక, బంతి, చామంతి, అడవి చామంతి, మూత్యాలపువ్వు, రుద్రాక్ష, నీలగొరింట, పట్టుకుచ్చులు, కట్ల, బీర.... ఇలా బతుకమ్మను పేర్చడంలో రకరకాల పూలను ఉపయోగిస్తారు. సాయంకాలం అందరూ ఒకచోట చేరి, బతుకమ్మ చుట్టూ తురుగుతూ పాటలు పాడుతూ తిరుగుతారు. చీకటి పడుతుండగా చెరువుల్లో నిమ్మజ్జనం చేస్తారు. మొదటి రోజు పేర్చే బతుకమ్మను 'ఎంగిలి బతుకమ్మ' అంటారు.

 బతుకమ్మ పండుగలో ఉన్న శాస్త్రీయ అంశాలేమిటో తెలుసుకుందాం.

ఇత్తడి తాంబులంలో గుమ్మడి ఆకులు పరిచి వాటి మీద తంగేడు పూలు పేరుస్తారు. తంగేడు పువ్వులు గొంతు సమస్యలకు,మూత్ర సంబంధిత సమస్యలకు ఔషధం. కాస్త ఏత్తులో పూల పేర్పు అయ్యాక గునక, బంతి, చామంతి, అడవి చామంతి, మూత్యాలపువ్వు, రుద్రాక్ష, నీలగొరింట, పట్టుకుచ్చులు, కట్ల, బీర.... ఇలా బతుకమ్మను పేర్చడంలో రకరకాల పూలను ఉపయోగిస్తారు.

~ గునక పువ్వు యాంటి-డైహెరియా,యంటి-డైయాబేటిక్ లక్షణాలు కలది.
~ క్రిమి-సంహారిణి,దోమలను నివరించేది బంతిపువ్వు.
~ చామంతిని కాలిన గాయాలకు, దెబ్బలకు, కంటి సంబంధిత రోగాలకు, అరుగుదల సమస్యలకు ఔషధంగా వాడతారు. ఇది యాంటి-బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగినది, కాలుష్య కారకాలను, బెంజిన్, అమోనియా వాయువలను పీల్చుకొని, గాలిని శుద్ధిచేస్తుంది.

ఈ విధంగా బతుకమ్మ పేరున వాడే ప్రతి పువ్వుకు చాలా ఔషధ గుణాలు ఉన్నాయి.

ఈ పూలన్ని గోపురంలా పేర్చాక పైన గుమ్మడిపువు గొడుగుపెడతారు. తమలపాకులో పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచి పక్కనే దీపం వెలిగిస్తారు. పసుపు శుభానికి సూచన, క్రిమి-సంహారిణి. దీపం జ్ఞానానికి సంకేతం. అది గాలిని శుద్ధి చేస్తుంది, క్రిములను హరిస్తుంది.

సాయంత్రం ఇంటిముందుకాని, వీధిలోకాని, దేవాలయంలో, చెరువు, వాగు ................ ప్రతి చోట అందరు చేరి, బతుకమ్మలను మధ్యలో ఉంచి 'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో...' అంటూ పాటలు పాడతారు.

చీకటి పడుతుండగా చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. ఆ పూలుకున్న ఔషధ గుణాలు నీటిని శుద్ధిచేసి, నీటిద్వారా వచ్చే రోగాలను హరిస్తాయి. ఇంట్లో 9 రోజులపాటు ఆ పూలను పేర్చడం, ఆ వాసన ఇల్లంత వ్యాపించడం ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న క్రిములు హరింపబడతాయి, అందరు ఆ వాసన పీల్చడం ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి హాయిగా, ఆరోగ్యంగా జీవిస్తారు.

సరస్వతీ దేవి

పిల్లలందరు ముఖ్యంగా పూజించవలసిన అమ్మవారు సరస్వతీ దేవి. మన చదువుల తల్లి సరస్వతీ దేవి.

సరస్వతీదేవి తెల్లని వస్త్రాలు సాత్వికతను సూచిస్తాయి. విద్యాభ్యాసం చక్కగా సాగాలంటే ఆహారంలో, ప్రవర్తనలో, మొత్తం జీవితంలో సాత్వికత ఉండాలి. సత్వగుణమే ప్రధానమని సూచిస్తున్నది అమ్మ వస్త్రధారణ. సరస్వతి దేవి ఒక చేతిలో జపమాలను,మరొక చేతిలో వేదాలను ధరించి కనిపిస్తుంది. వేదం అనంతమైన జ్ఞానానికి సంకేతం. వేదం ఈ సృష్టికి ముందే పరమాత్ముడి ద్వారా ఇవ్వబడింది. వేదం నశించనిది, ఎప్పటికి ఉంటుంది. జపమాల జపానికి సంకేతం. జపమాలతో సరస్వతి దేవి నిరంతరం జపిస్తూ ఉంటుంది. చదువు రావాలి, జ్ఞానాన్ని పొందాలి అంటే,  నేర్చుకున్న విషయాన్ని అనేక మార్లు మననం చేయాలి, మనసులో ధారణ చేయాలి.  అప్పుడే మనకు సారం అర్ధమవుతుంది.

“తపస్స్వాధ్యాయ నిరతం” అంటే కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన, ఆసక్తి ఎంత అవసరమో, తెలిసిన విషయాలను మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవడం కూడా అంతే అవసరం అంటుంది మన ధర్మ శాస్త్రం. సరస్వతి దేవి ఒక చేతిలో జపమాలను, మరొక చేతిలో వేదాలను ధరించి కనిపిస్తుంది. మిగితా దేవీదేవతలందరూ పువ్వుల్లో కూర్చుంటే చదువుల తల్లి సరస్వతి దేవి మాత్రం రాయి మీద కూర్చొని ఉంటుంది. ఏ పువ్వైనా కొంత సమయం మాత్రమే వికసించి ఉంటుంది. ఉదయానికి వికసించిన పువ్వు సాయంత్రానికి వాడిపోతుంది. కాని రాయి మాత్రం పదిలంగా ఉంటుంది. ఈ లోకంలో విద్య, జ్ఞానం మాత్రమే శాశ్వతమైనవని, సంపదలు కొంత కాలం మాత్రమే ఉంటాయి అని, అమ్మ సందేశం ఇస్తూ, ఎప్పటికి తరిగిపోని విద్యనే అనుగ్రహిస్తానంటోంది.

అమ్మవారి వాహనం హంస – పాలు,నీరు కలిపి హంస ముందు పెడితే హంస నీటిని వేరు చేసి పాలను మాత్రమే త్రాగుతుంది. ఒక నాణానికి బొమ్మ బొరుసుల తరహాలో ప్రతి విషయంలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ప్రతి విషయంలోని మంచిని మాత్రమే వెతికి దానిని మాత్రమే గ్రహించి, చెడును విసర్జించే వారే సరస్వతి దేవికి అత్యంత ప్రియులని, వారి ద్వారా తన వైభవాన్ని చాటుతుందని తన హంస వాహనం ద్వారా అమ్మ సందేశమిస్తోంది.
హంస అంటే ఊపిరి. మనం నిశ్వాస నుంచి  ”సః” అనే శబ్దం అని వెలువడుతుంది. బయటనుంచి లోపలికి ప్రవశించే ప్రాణవాయువు ఉచ్చ్వాశం “అహం” అంటూ లోనికి ప్రవేశిస్తుంది. ఉచ్చ్వాశ, నిశ్వాసల నిరంతర ప్రక్రియనే హంస జపం అంటారు. శరీరంలో ప్రాణం ఉన్నతవరకు ఈ జపం జరుగుతూనే ఉంటుంది. సః అంటే అతడు, భగవంతుడు, పరమాత్మ అని, అహం అంటే నేను అని అర్ధం. ఇది పరంపరలో, వేగంలో ముందు వెనుకా అయి అహం సః, అహం సః…….. అంటూ హంసో హంసో హంసోహం హంస్ససోహం హంసః అంటు బాగా గమనిస్తే సోహం అంటుంది వినిపిస్తుంది. అప్పటివరకు అతడు, నేను అని వెర్వేరుగా వినిపించేది, అతడే నేను గా మారుతుంది. అతడు పరమాత్మ. నేను అంటే జీవాత్మ. అతడే నేను అని తెలుసుకోవడమే అసలైన జ్ఞానం. అదే అసలైన విద్య. దానికి ఎంతో సాధన కావాలి. ఈ విద్యకు అధిదేవత మన అమ్మ సరస్వతి దేవి. అందుకే ఆవిడ హంసను వాహనంగా చేసుకుంది.సర్వసతి అన్న పదం కూడా రెండు పదాలను వచ్చింది. సరః అంటే సారము అని, స్వః అంటే నా/వ్యక్తి యొక్క. అందరిలో ఉండే నేను గురించి పూర్తిగా తెలుసుకునే శక్తినిచ్చేది కనుక అమ్మ సరస్వతీ.

ఇంకోమాటలో చెప్పాలంటే ఎవరో చనిపోతారు. అందరూ ఏడుస్తుంటారు, అప్పుడే పోయావో అంటూ శోకాలు పెడతారు. ఇంకా శవాన్ని దహనం చేయలేదు. ఆ వ్యక్తి అక్కడే పడుకుని ఉన్నాడు. కాకపోతే ఉలుకుపలుకు లేదు, బొమ్మలాగా ఉన్నాడు, అంతేకదా. మరి ఎక్కడికో పొవడమేమిటి? ఎక్కడికో పోయింది ఎవరు? కదలకుండా ఉన్న ఆ దేహం ఎవరు? అతనే దేహం అయితే అతను అక్కడే ఉన్నాడు. మరీ ఈ ఏడుపులు, శోకాలు ఎందుకు? వెళ్ళిపోయిందెవరు, పోని అతను వెళ్ళిపోయాడంటే అక్కడ పడి ఉన్నది ఎవరు? అతను ప్రాణం అయితే, ఆ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడికి పోయింది? అసలు ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? ఇలా అనేక ప్రశ్నలు వస్తాయి. వాటికి సమాధానం చెప్తుందీ విద్య.

ఇన్నాళ్ళు అతన్ని దేహంగా గుర్తించినవారు ఇప్పుడు అతన్ని వెరొక పదార్ధంగా గుర్తిస్తున్నారు. ఆ పదార్ధమే ఆత్మ. దాని గురించి తెలుసుకుంటే ఇక ఈ లోకంలో తెలుసుకోవలసినవంటూ ఏవీ ఉండవు. అది అర్దమైతే అన్ని అర్దమైనట్లే. దాన్ని తెలుసుకోవడమే ఆత్మవిద్య. దాన్ని అనిగ్రహించే తల్లీ మాన సరస్వతీదేవి.

సరస్వతీ నమస్థుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా

సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు

ఇదే వ్యాసాన్ని అచ్చంగా తెలుగు మాసపత్రికకు జూన్‌లో రాయడం జరిగింది
http://acchamgatelugu.com/?p=6548

Wednesday 1 October 2014

సరస్వతీ తత్వం

సరస్వతీ అనే పదంలోనే అమ్మవారి తత్వం దాగివుంది. సరః అంటే సారము, స్వ అంటే తన యొక్క అని అర్దం. తన యొక్క సారాన్ని/తత్వాన్ని సంపూర్ణంగా తెలిపేది సరస్వతి.

మనం ఆత్మ స్వరూపులం అయినా, మనల్ని మనం ఈ శరీరంగా భావించుకుంటాం. మనసుకు కలిగిన బాధలను మనవిగా భావించి బాధపడతాం. పూర్వజన్మ కర్మఫలాలను అనుభవించేది దేహము, దేహంలో ఉన్న మనస్సే కానీ, మనం కాదు. కానీ శరీరానికి కలిగిన కష్టనష్టాలకు, దుఃఖాలకు కృంగిపోతాం. అహంకారమమకారాలకు బానిసలమై, పరిమితి కలిగిన ఈ దేహాన్నే మనంగా ఊహించుకుంటూ జీవిస్తున్నాం.

కానీ నిజానికి మన తత్వం ఏమిటి? మనమేమిటి? అని ఆలోచిస్తే ఎప్పుడు మనలో 'నేను' అనే తలంపు ఒకటి మెదులుతుంటుంది. ఈ దేహం పుట్టినప్పటి నుంచి మరణించేవరకు ఆ తలంపు మనల్ని వీడదు. ఆ 'నేను' అనే తలంపు ఎక్కడి నుంచి వస్తోందో తెలుసుకునేందుకు ధ్యానంలో విచారాణ ప్రారంభిస్తే, అది ఆఖరున ఆత్మలో లయమవుతుందంటారు భగవాన్ శ్రీ రమణ మహర్షి. ఆత్మ మన సహజ స్థితి, నిత్యానంద స్థితి, ఆత్మయే మనం. ఈ శరీరంలో ఆత్మ ఉండడం కాదు, ఆత్మ ఈ శరీరాన్ని ధరించింది, ఆ ఆత్మయే మనం. ఆత్మకు పరిమితి లేదు, ఆత్మ అంతటా వ్యాపించి ఉంది, ఈ లోకంలో ఆత్మ తప్ప మరొకటిలేదు.

ఈ ఆత్మ తత్వమే సనాతన భారతీయ సంస్కృతిని ప్రపంచంలో అత్యున్నత స్థానంలో నిలిపింది. ప్రపంచంలో ఇతర మతాలు అశాశ్వతమైన ఈ శరీరం గురించి చెప్తే, మన ధర్మం సనాతనమైన ఆత్మ తత్వం గురించి ప్రపంచానికి చెప్పింది. మానవజన్మకు సార్ధకత/ నిర్యాణం/ మోక్షం లభించాలంటే ఆత్మ తత్వం అర్దమవ్వాలి. అటువంటి ఆత్మ తత్వం(మన తత్వం) గురించి మనకు సంపూర్ణంగా తెలియజేస్తుంది కనుక అమ్మను సరస్వతీ దేవిగా ఆరాధిస్తాం.

ఓం సరస్వత్యై నమః