Monday 20 October 2014

ధనత్రయోదశి విశేషాలు

ఆశ్వీయుజ బహుళ త్రయోదశి - దీనికే ధనత్రయోదశి, ధన్వంతరి జయంతి అని పేరు.

ధనత్రయోదశి విశేషాలు:

పురాణప్రాశస్త్యం : పాలసముద్రంలో మందరపర్వతాన్ని అమృతం కోసం దేవతలు, రాక్షసులు చిలికినప్పుడు అమృతభాండాన్ని ఒక చేతితోనూ, శంఖువును మరొకచేతితోనూ, మూలికలు, చక్రం మిగితా చేతితులలో ధరించి ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు ఉధ్బవించాడు #ధన్వంతరి అంటూ పురాణ కధనం. ఈయన్ను పూజించడం వలన ఆరోగ్యం సిద్ధిస్తుంది.

ధనత్రయోదశి కధ:

పూర్వం హిమ అనే పేరుగల రాజు ఉండేవాడు. అతనికి ఒకడే కుమారుడు. ఆ కొడుకుని చిన్నప్పటి నుంచి అలారుముద్దుగా పెంచారు. క్షత్రియుడు కనుక కత్తిసాము మొదలైన క్షత్రియ విద్యలన్నీ నేర్పించారు. కానీ ఈ రాకుమారుడు జాతకరీత్యా అతనకి వివాహం జరిగిన నాలుగో రొజుకు మరణిస్తాడని పురోహితులు చెప్తారు. అయినా, ఓ రాకుమారి అతడిని ఇష్టపడి పెళ్ళి చేసుకుంటుంది. తన పసుపు కుంకాలను తానే కాపాడుకుంటానని శపధం చేస్తుంది. నాలుగవ రోజు...... రాకుమారుడి గది ముందు ఆభరణాలు రాసులుగా పోస్తుంది. దేదీప్యమానంగా దీపాలను వెలిగిస్తుంది. రంగురంగుల రంగవల్లులు దిద్దుతుంది. తన ఆరాధ్య దేవతయైన లక్ష్మీదేవిని కీర్తిస్తూ శ్రావ్యంగా పాటలు పాడుతుంది. రాకుమారుడుఇ ప్రాణాలు తీసుకువెళ్ళడానికి యమధర్మ రాజు పాము రూపం ధరించి వస్తాడు. బంగారు ఆభరణాల మీద దీపపు కాంతి పడి, ఆ గదంతా వెలుగు విరజిమ్ముతున్నాయి. ఆ నెరుపు తళుకులకు ఈ పాము చూపు మందగిస్తుంది. ఆదుగు ముందుకు వేయలేకపోతాడు. ఈ యువరాణి సంగీతానికి పరవశించి వచ్చిన పని మర్చిపోయి, ఆమె సంగీతం వింటూ ఉంటాడు.  ఇంతలోనే తెల్లారిపోతుంది. యమ ఘడియలు దాటిపోవడంతో, ఖాళీ చేతులతో వెళ్ళిపోతాడు.

అందువల్ల ఈ రోజు యముడికి ప్రీతికరంగా యమదీపం వెలిగిస్తారు. ఉత్తరాదిలో ఈ రోజు సాయంత్రం ఆరుబయట, అన్నాన్ని రాశిగా పోసి యమదీపం వెలిగిస్తారు.

ఆశ్వయుజ బహుళ త్రయోదశి (అంటే నరక చతుర్దశికి ముందు వచ్చే తిధి).దీన్నే "ధన త్రయోదశి" అంటారు.ఈనాటి రాత్రి అపమృత్యువు (unnatural death) నివారణకై నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి, పూజించి, ఇంటి ముందు ఉంచాలి. దీనికి "యమ దీపం" అని పేరు. యముని అనుగ్రహం పొందడం కోసం ఈ దీపాన్ని వెలిగించాలి.

కాగా ఈ మధ్యకాలంలో ధనత్రయోదశి రోజున బంగారం కొనాలనే ప్రచారం మొదలైంది. కానీ అటువంటి నియమం ఏమీ లేదు. ప్రపంచీకరణ నేపధ్యంలో దేశంలోకి బహుళజాతి సంస్థలు వ్యాపారం కోసం వచ్చాయి, లాభలు ఆర్జించడమే ధ్యేయంగా ఉన్న సంస్థలు మార్కెట్ చేసుకోవడం కోసం అక్షయతృతీయ, ధనత్రయోదశి రోజున బంగారం కొనాలనే ప్రచారాన్ని మొదలుపెట్టాయి. అసలు ఇటువంటి ఆచారం మన బామ్మలకు, అమ్మమ్మలకే తెలియదట. వాళ్ళకే ఇది వింతగా ఉందంటే అసలు విషయం ఏంటో అర్దం చేసుకోవచ్చు. పురాతనకాలంలో భారతదేశంలో పండుగ రోజంటూ ఏదైనా ఉందంటే అది దానం చేసిన రోజే. సంపదలు దాచుకోవడం కాకుండా, ఉన్న సంపదను పుణ్యంగా మార్చుకుని, వచ్చే జన్మలకు ఉపయోగించుకోవడం భారతీయుల విధానం. ధనత్రయోదశి రోజున చేసే దానం, పూజ, జపం అధికఫలాన్ని ఇస్తాయి. 17 వ శతాబ్దం వరకు భారత్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశమనీ, భారత్‌లో బంగారం పొంగిప్రవహించేదనీ ఆంగ్లేయుల రికార్డులే చెప్తున్నాయి. అటువంటి బంగారాన్ని భారతీయులు ఎప్పుడు కొనగోలు చేయలేదు, ఆ అవసరం కూడా రాలేదు. వచ్చిన అతిధులకు బంగారం దానం చేసిన సంస్కృతి మనది.

ధనత్రయోదశి శుభాకాంక్షలు 

No comments:

Post a Comment