Monday 12 January 2015

14-01-2015, బుధవారం, భోగి - భోగి మంటలు, విశేషాలు

14-01-2015, బుధవారం, భోగి

భుజ్ అనే సంస్కృత ధాతువు నుండి భోగి అనే పదం వచ్చిందని చెప్తారు. భోగం అంటే సుఖం. పూర్వం ఈ దినమే శ్రీ రంగనాధస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందింది. భోగి అనగానే మనకు గుర్తుకువచ్చేది భోగిమంటలు. భోగి పండుగ నాటి తెల్లవారుఝామునే భోగి మంటలు వేస్తారు. భోగి మంటలు అసలెందుకు వేయాలి?

సాధారణంగా అందరూ చెప్పేది, ఇది చలికాలం కనుక వెచ్చదనం కోసం వేస్తారని. కానీ నిజానికి భోగిమంటలు వెచ్చదనం కోసమే కాదు ఆరోగ్యం కోసమూ వేస్తారు. ధనుర్మాసం నెలంతా ఇంటిముందు పెట్టిన గోబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటిని ఈ భోగిమంటల్లో వాడతారు. దేశీ ఆవు పేడ పిడకలను కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది, సూక్ష్మ క్రిములు నశిస్తాయి, ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదలవుతుంది. దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. చలికాలంలో అనేక రోగాలు వ్యాపిస్తాయి. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టిపీడిస్తాయి. వాటికి ఔషధంగా ఇది పనిచేస్తుంది.

మనం పెద్ద మంటరావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరడ్లు వేస్తాము. అవి కాలడానికి ఆవునేయిని వేస్తారు. అగ్నిహోత్రంలో వేయబడిన ప్రతి 10 గ్రాముల దేశవాళీ ఆవునేయి నుంచి 1టన్ను ప్రాణవాయువు (oxygen) ను విడుదల చేస్తుంది. ఈ ఔషధ మూలికలు, ఆవునేయి, ఆవు పిడకలను కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైనది. మన శరీరంలోని  72,000 నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషధం ఇవచ్చు. అదే లోకంలో అందరికి వస్తే అందరికి ఔషధం సమకూర్చడం దాదాపు అసాధ్యం. అందులో కొందరు పేదలు కూడా ఉండచ్చు. వారికి వైద్యం చేయుంచుకునే శక్తి లేకపొవచ్చు. ఇదంతా ఆలోచించిన మన ప్రాచీనులు అందరు కలిసి భోగిమంటల్లో పాల్గోనే సంప్రదాయం తెచ్చారు. దాని నుండి వచ్చే గాలి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కులాలకు అతీతంగా అందరు ఒక చోట చేరడం ప్రజల మధ్య దూరాలను తగ్గిస్తుంది, ఐక్యతను పెంచుతుంది. ఇది ఒకరకంగా అగ్నిదేవుని ఆరాధన. మరొక విధంగా గాలిని శుద్ధిచేస్తూ వాయుదేవునికిచ్చే గౌరవం కూడా.

కాని మనం ఫ్యాషన్, సృజనాత్మకత పేరున రబ్బరు టైర్లను పెట్రొల్ పోసి తగలబెట్టి, దాని ద్వారా విషవాయువులను పీలుస్తూ, కాలుష్యాన్ని చేస్తూ మన ఆరోగ్యాన్ని తగలేసుకుంటున్నాం, పర్యావరణాన్ని నాశనం చెస్తున్నాం. ఉన్న రోగాలే కాక క్రొత్త రోగాలు తెచ్చుకుంటున్నాం.ఇక భోగిమంటల్లో పనికిరాని వస్తువులను కాల్చండి అని వింటుంటాం. పనికిరాని వస్తువులను వేస్తే కూడా ఇలాంటి ప్రభావాలే కనిపిస్తాయి. పైగా అడ్డమైనవి, ప్లాస్టిక్ కవర్లు, చెత్త సామాన్లు తగలబెట్టడం వాయుదేవుడికి చేసే అపచారమవుతుంది.

ఇప్పుడు మనం చరిత్రలో ఒక విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. హిందువుల దగ్గర ఉన్న జ్ఞాన సంపదను నాశనం చేస్తేకానీ భారతదేశాన్ని ఆక్రమించుకోలేమనుకున్న బ్రిటిష్ దుండగులు, భోగిమంటల్లో పాతసామానులు తగలబెట్టాలన్న నెపంతో అమాయకప్రజలు ఎన్నో వందల సంవత్సరాలుగా వారసత్వంగా కాపాడుకుంటూ వస్తున్న అతిప్రాచీన తాళపత్ర గ్రంధాలను భోగిమంటల్లో వేసి కాల్పించేశారు.
   
భోగిమంటల్లో కాల్చవలసినది పనికిరాని వస్తువులు కాదు, మనలో ఉన్న పనిరాని అలవాట్లు, చెడు లక్షణాలు. అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం, విజయాలు సిద్ధిస్తాయి.

No comments:

Post a Comment